న్యూఢిల్లీ, ఆగస్టు 17: రోహింగ్యా శరణార్థుల విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నది. రోహింగ్యాలను దేశం నుంచి తరిమికొట్టాలని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని తెలంగాణలోని బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం వారికి ఇండ్లు ఇస్తామని, పోలీసు రక్షణ కల్పిస్తామని చెబుతున్నది. ఆశ్రయం కోరి వచ్చిన శరణార్థులను భారత్ ఎప్పుడూ స్వాగతిస్తుందని, ఒక మైలురాయి నిర్ణయంతో రోహింగ్యాలందరినీ ఢిల్లీలో ఫ్లాట్లకు మార్చనున్నామని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ బుధవారం పేర్కొన్నారు. ‘ఢిల్లీలోని బక్కర్వాలా ఏరియాలో రోహింగ్యాలకు ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లు ఇస్తాం. అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు యూఎన్హెచ్ఆర్సీ ఐడీ కార్డులు, 24 గంటల ఢిల్లీ పోలీసుల రక్షణ కల్పిస్తాం’ అంటూ ఉదయం ట్వీట్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పురీ ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే బీజేపీ ప్రభుత్వం మాటమార్చింది. అబ్బేబ్బే అలాంటిదేమీ లేదంటూ కేంద్ర హోంశాఖ హడావుడిగా వివరణ ఇచ్చింది. రోహింగ్యాలకు ఫ్లాట్లు అందించడానికి కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నది. చట్టప్రకారం అక్రమ విదేశీయుల బహిష్కరణ పూర్తయ్యే వరకు వారికి నిర్బంధ క్యాంపుల్లో ఉంచాలని, ప్రస్తుతం వారు ఉంటున్న ప్రదేశాలను నిర్బంధ సెంటర్లుగా ప్రకటించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్టు తెలిపింది. కేంద్ర హోంశాఖ అంచనాల ప్రకారం రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 వేల మంది రోహింగ్యా శరణార్థులు నివసిస్తున్నారు.