ముంబై : ఓ వివాహ విందు వేడుకలో దారుణం జరిగింది. పెళ్లి కుమారుడి స్నేహితుడితో పాటు వధువు సోదరుడిపై ఓ నలుగురు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి కారణం మ్యూజిక్ అని బాధిత వ్యక్తుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్లోని కపిల్ నగర్లో సోమవారం చోటు చేసుకుంది.
కపిల్ నగర్కు చెందిన ఓ యువకుడు శనివారం వివాహం చేసుకున్నారు. పెళ్లి కుమార్తె ఇంటి వద్ద ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. రిసెప్షన్లో భాగంగా మ్యూజిక్ ఏర్పాటు చేసినప్పటికీ మధ్యలో ఆపేశారు. దీంతో మ్యూజిక్ ఎందుకు ఆపేశారని ఓ నలుగురు వ్యక్తులు.. వరుడి స్నేహితుడు, వధువు సోదరుడితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆ ఇద్దరిపై నలుగురు కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధిత వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురు రిసెప్షన్ నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.