హైదరాబాద్: నగరంలోని కొండాపూర్లో (Kondapur) ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యంమత్తులో స్నేహితుడిని నరికి చంపాడో వ్యక్తి. కొండాపూర్కు చెందిన మహేశ్వరరావు కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి స్నేహితుడైన చిట్టిబాబుతో కలిసి మద్యం సేవించాడు. ఈ సందర్భంగా ఇరువురిమధ్య చిన్న వివాదం చెలరేగింది. అదికాస్త గొడవకు దారితీసింది. ఆగ్రహంతో కొబ్బరిబొండాల కత్తితో మహేశ్వరరావుపై చిట్టిబాబు దాడిచేశాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన మహేశ్వరరావును స్థానికులు దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.