శ్రీనగర్ : ఉత్తర కశ్మీర్ బారాముల్ల జిల్లాలోని ఉరి సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట రూ.25కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఎస్ఎస్పీ రాయీస్ అహ్మద్ భట్ మాట్లాడుతూ బారాముల్ల సరిహద్దు సమీపంలో శనివారం అనుమానాస్పద కదలికలను గమనించి.. దళాలను అప్రమత్తం చేయగా.. ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల నుంచి అక్రమంగా డ్రగ్స్ను రవాణా చేసేందుకు చేసిన ప్రయత్నాలను జవాన్లు విఫలం చేశారన్నారు. సుమారు 25 నుంచి 30 కిలోల హెరాయిన్ను బలగాలు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్లో రూ.25కోట్లు ఉంటుందని అంచనా. జిల్లాలో డ్రగ్స్ రవాణాపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సౌంజనా గ్రామం సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి డ్రోన్ సహాయం జారవిడిచిన ఆయుధాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.