న్యూఢిల్లీ, డిసెంబర్ 11: నాలుగేండ్ల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకొన్న హెరాయిన్ 8 కిలోలు. 2021లో స్వాధీనం చేసుకొన్న హెరాయిన్ 3 వేల కిలోలపైనే. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) లెక్కల ప్రకారం 2017లో వివిధ రాష్ర్టాల్లో పోలీసులు స్వాధీనం చేసుకొన్న హెరాయిన్ 825 కిలోలు. 2020లో అది 3,276 కిలోలు. దేశంలో డ్రగ్స్ మార్కెట్ ఎంతగా విస్తరించిందో చెప్పడానికి ఈ అంకెలు తార్కాణం. ఇక్కడ అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే… స్వాధీనం చేసుకొన్న డ్రగ్స్, మొత్తం మార్కెట్లో 10% కూడా కాదని అధికారులు చెప్తున్నారు. ‘పోలీసులు, కేంద్ర సంస్థలు స్వాధీనం చేసుకొన్న హెరాయిన్.. మొత్తం డ్రగ్స్ మార్కెట్లో కేవలం 10% కూడా కాదు’ అని పంజాబ్ మాజీ డీజీపీ శక్తికాంత్ శర్మ అన్నారు.
రూటు మార్చిన స్మగ్లర్లు
దేశంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నది. అదే సమయంలో, ఇటీవల స్మగ్లర్లు ఇండియాను కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. డ్రగ్స్ రవాణా రూట్లను మార్చడం, దేశానికి అతి పెద్ద తీర రేఖ ఉండటం.. డ్రగ్స్ స్మగ్లర్లు పెచ్చరిల్లడానికి ఊతం ఇస్తున్నది. స్మగర్లు కొన్నేండ్లుగా స్మగ్లింగ్ పద్ధతిని మార్చేశారు. పోర్టుల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ఇండియాకు చాలా పెద్ద తీర రేఖ ఉన్నది. అనేక పోర్టులు ఉన్నాయి. దీంతో నిఘా కష్టం అవుతున్నది. అన్ని పోర్టుల్లో నిఘా పెట్టామని, తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.
డ్రగ్స్ లావాదేవీలకు క్రిప్టో వినియోగం
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ, డార్క్నెట్లను డ్రగ్స్ బిజినెస్కు ఉపయోగిస్తున్నారంటూ హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీల నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కమిటీ అభిప్రాయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్లమెంటు సభ్యుడు ఆనంద్శర్మ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. క్రిప్టోకరెన్సీలు, డార్క్నెట్ ద్వారా జరిపే డ్రగ్ స్మగ్లింగ్ను కనుగొని, దర్యాప్తు చేసేందుకు సైబర్వింగ్ను ఏర్పాటుచేయాలంటూ సిఫారసు చేసింది. ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ సెంటర్తో కలసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సైబర్ వింగ్ ఏర్పాటుచేయాలని హోంశాఖకు కమిటీ సూచించింది. ఆర్థిక శాఖతో సంప్రదించి, వింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. రెగ్యులర్ సెర్చ్ ఇంజిన్లకు దొరక్కుండా డార్క్నెట్లోని ఈ-కామర్స్ సైట్లు పనిచేస్తాయి.