హైదరాబాద్, ఏప్రిల్ 4 : ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్కు సంబంధించిన డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఉప్పల శారద కుమారుడు ఉప్పల అభిషేక్తో పాటు రేవంత్రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్రెడ్డికి సంబంధాలు ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. తమ పార్టీ నేతల, బంధువుల సంతానాన్ని అదుపులో పెట్టుకోలేని బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్రెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేసి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నేతల సంతానం మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతూ, అడ్డంగా దొరికిపోతున్నారని విమర్శించారు. డ్రగ్స్ క్రయవిక్రయాలకు పాల్పడినవారిని ఎన్కౌంటర్ చేయాలని, ఉరితీయాలని ప్రగల్భాలు పలికే నేతలు ఇప్పుడేమి సమాధానం చెప్తారని నిలదీశారు.
ఎవరిని ఎన్కౌంటర్ చేయాలో.. ఎవరిని ఉరితీయాలో వారే చెప్పాలని ఎద్దేవాచేశారు. బండి సంజయ్ సైకో సంజయ్గా, గం జాయి సంజయ్గా వ్యవహరిస్తున్నాడని, రేవంత్రెడ్డి చీపుగా ప్రవర్తిస్తున్నాడని నిప్పులు చెరిగారు. వీరిద్దరూ ముందు తమ కుటుంబాలను అదుపులో పెట్టుకోవాలని హితవు చెప్పారు. పేకాట క్లబ్బులు, గుడుంబాపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే ఇటువంటి వ్యవహారాలు బయటపడేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు చిల్లర, మత్తు రాజకీయాలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంతో సంబం ధం ఉన్న అందరికీ చట్ట ప్రకారం కఠినశిక్షలు పడేలా చూడాలని డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్కు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
విద్వేషాలు రెచ్చగొడితే ఉపేక్షించం:
ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని బండి సంజయ్ ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద హెచ్చరించారు. బండి సంజయ్ చార్మినార్ ఫైల్స్, భాగ్యనగర్ ఫైల్స్ తీస్తామంటూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేలా
వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్తో పాటు రాష్ట్ర వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ఇటువంటి వ్యాఖ్యలతో కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినవారు ఎంతటివారైనా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ర్టానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తుంటే.. కండ్లు కుట్టిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
బండి సంజయ్ ఎంపీగా రాష్ర్టానికి, కరీంనగర్కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.