12 పంచాయతీల్లోని 3,334 ఇండ్లకు నల్లా కనెక్షన్లు
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శుద్ధజలం సరఫరా
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 25 నమస్తే తెలంగాణ : ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్ల రాకతో ప్రతి ఆడబిడ్డ కండ్లలో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో బిందెలు పట్టుకుని వాగుకు పోవాల్సిన రోజులు పోయాయనే సంతోషం కనిపిస్తున్నది. ప్రజలు ప్రతిరోజూ ప్రతి ఇంటా నల్లా నీళ్లు పట్టుకుంటూ సర్కారు చేసిన మేలును తలస్తుంటే.. కాషాయ పార్టీ కండ్లు మండిపోతున్నాయి. ‘నీళ్లొస్తున్నయి. సర్కారు మా దూప తీర్చింది. మా కష్టాలు పొయినయి’ అని ప్రజలు చెప్తుంటే.. ‘అక్కడ నీళ్లొస్తలేవు.. పైసలన్నీ సర్కారు దోచుకుంటున్నది’ అని బీజేపీ నేతలు నోటికొచ్చినకాడికి మాట్లాడుతుండటం గమనార్హం.
ఇది అబద్ధం
మిషన్ భగీరథ పేరుతో సర్కారు రూ.వేల కోట్లు దోచుకున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచికల్పేట్ మండలంలో ఇప్పటికీ నీళ్లు రావడంలేదు. (ఇటీవల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు)
ఇదీ నిజం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో 12 గ్రామ పంచాయతీల పరిధిలో 3,334 ఇండ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ప్రభుత్వం నల్లా సౌకర్యాన్ని కల్పించింది. ఉదయం, సాయంత్రం ఇంటింటికీ మిషన్ భగీరథ శుద్ధజలం అందుతున్నది. మండలంలోని మారుమూల గ్రామాల ప్రజలకు గతంలో తాగేందుకు స్వచ్ఛమైన నీరు దొరకని పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు తాగటానికే కాదు స్నానాలు, పశువులకు, ఇతర అవసరాలకు కూడా శుద్ధజలాన్నే వినియోగిస్తున్నారు. మా పల్లెలో ఇంటింటికీ నల్లా ఏర్పాటుచేశారని, రోజూ పొద్దున, సాయంత్రం రెండుసార్లు నీళ్లు వస్తున్నాయని పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడకు చెందిన గిరుగుల తార తెలిపారు. ఒకప్పుడు నీళ్ల కోసం వాగుల దగ్గరకు పోయేటోళ్లమని చెప్పారు. ఏండ్లపాటు వాగునీళ్లపై ఆధారపడ్డామని, కానీ, ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా మా ఇంటికే నీళ్లు వస్తున్నాయని బొంబాయిగూడకు చెందిన తుమ్మిడి సుజాత సంతోషం వ్యక్తంచేసింది. నీటి సమస్య తీరిందని సంబురపడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 1,151 గ్రామాలకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1,150 గ్రామాలకు నీరు సరఫరా అవుతున్నది.