న్యూఢిల్లీ : భవిష్యత్లో ఎదురయ్యే మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనే దిశగా పరిశోధనలు చేపట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. డీఆర్డీఓ, డీఐపీఏఎస్కు చెందిన దాదాపు 25 మంది శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులను సోమవారం ఉపరాష్ట్రపతి తమ నివాసానికి ఆహ్వానించారు. ఈ డీఆర్డీఓ చైర్మన్తో పాటు డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ, అలైడ్ సైన్సెస్ (డీఐపీఏఎస్)కు చెందిన శాస్త్రవేత్తలు ఉప రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ ఉత్పత్తులను ఉప రాష్ట్రపతికి చైర్మన్ సతీశ్రెడ్డి వివరించారు. కొవిడ్ -19 చికిత్స, నిర్వహణ కోసం వివిధ స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసిన డీఐపీఏఎస్, ఇతర డీఆర్డీఓ ల్యాబ్ను ఉపరాష్ట్రపతి అభినందించారు.
అనంతరం మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఎన్నడూ చూడని ఆరోగ్య సంక్షోభం ఎదురైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలు, వారి జీవనోపాధి ప్రభావితం అయ్యాయన్నారు. సార్స్ కోవ్ -2 నేపథ్యంలో ఈ మహమ్మారులు ఏ క్షణమైనా ముప్పిరిగొనే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆహ్వానించి తమ అభిప్రాయాలు, ఆలోచనలను వారితో పంచుకున్నందుకు ఉపరాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఐపీఏఎస్ సంచాలకులు డాక్టర్ రాజీవ్ వర్షిణి, శాస్త్రవేత్తలు ఉన్నారు.