వాషింగ్టన్: ఒకవైపు కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పడకలు లభ్యం కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టీకాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు. వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుపడే రక్షణ కవచమే మాస్కు. అయితే అది కూడా ఒక్కటి కాదు.. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) స్పష్టం చేసింది. రోగాల నిర్ధారణ, నివారణ, చికిత్స విధానాలకు సంబంధించి అమెరికాలో ఇదే అత్యున్నత నిర్ణాయక సంస్థ. సర్జికల్ మాస్కు.. దాని మీద కాటన్ మాస్కు ధరిస్తే అధిక రక్షణ ఉంటుందని సీడీసీ జరిపిన అద్యయనంలో తేలింది. అవతలి వ్యక్తులు దగ్గడం వల్ల, ఊపిరి తీయడం వల్ల వెలువడే సూక్ష్మ తుంపరలు ముక్కులోకి వెళ్లలేదని ఈ అధ్యయనంలో తేలిన ముఖ్యమైన విషయం. అయితే మాస్కులు రెండూ సరిగా అమరాయా.. శ్వాస ఆడుతోందా.. దృష్టికి ఆటంకం ఏమీ లేదు కదా అనే విషయాలు సరి చూసుకోవాలి. కరోనా రెచ్చిపోతున్న వేళ ఈ మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. అది కూడా ఇతరుల సమక్షంలో తప్పక పాటించాలి. ఇక భౌతిక దూరం, అవసరమైతేనే బయటికి వెళ్లడం వంటి కరోనా నిబంధనలను ఈ ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు తప్పకుండా పాటించి తీరాల్సిందే.