జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి రోడ్లపైకి తీసుకురావాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. నగరంలో దాదాపు 50 బస్సులు తిప్పాలని నిర్ణయించగా, మొదటి విడుతగా 25 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు అందుకు సంబంధించిన టెండర్లకు నోటిఫికేషన్ జనవరిలో విడుదల చేశారు. డబుల్ డెక్కర్కు సంబంధించి బీఎస్-6 ప్రమాణాలు కలిగిన నాన్ ఏసీ ఇంట్రా సిటీ బస్సులను కొనుగోలు చేయనున్నారు.
ఫిబ్రవరి 4నుంచి టెండర్లు స్వీకరించగా 15న ముగించారు. టెండర్ ప్రక్రియలో భాగంగా ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఫిబ్రవరి 23 వరకు గడువు విధించి 25న అన్ని రకాల అంశాలతో పొందుపరుస్తూ సీల్డ్ కవర్లో టెండర్లను డ్రాప్ బాక్సుల ద్వారా స్వీకరించారు. టెండర్లలో భాగంగా టెక్నికల్ బిడ్డింగ్, ఫైనాన్షియల్ బిడ్డింగ్ పరిశీలించారు. అయితే టెక్నికల్ బిడ్డింగ్లో అర్హత సాధించిన వారి ఫైనాన్షియల్ బిడ్డింగ్ను త్వరలోనే తెలియజేస్తామని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడం కోసం అనేక కూడళ్లలో ఫ్లై ఓవర్లు నిర్మించారు. అందులో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కీలకంగా మారింది. దీంతో డబుల్ డెక్కర్ రాక పోకలు కొనసాగించడానికి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కొంత సమస్యగా మారనున్నది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఫ్లై ఓవర్ల సమస్యలు లేని మార్గాల్లో వీలైనంత త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులను నడిపించడానికి ఆర్టీసీ అవసరమైన చర్యలు చేపడుతున్నది. అయితే అందుకు సంబంధించిన రూట్మ్యాప్ను అధికారులు సిద్ధం చేశారు. ఈ మేరకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
డబుల్ డెక్కర్ బస్సులను నగరం పరిధిలో ఉన్న అన్ని రకాల పర్యాటక ప్రదేశాలకు అనుసంధానం చేయనున్నారు. చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, హైకోర్టు, హైటెక్ సిటీ, శిల్పారామం, హుస్సేన్సాగర్, గోల్కొండ వంటి పర్యాటక ప్రదేశాలను వీక్షించే విధంగా డబుల్ డెక్కర్ బస్సులను ప్రత్యేకంగా రూపొందించనున్నారు. జీహెచ్ఎంసీ నలువైపులా విస్తరిస్తున్న ఐటీ కారిడార్ను కవర్ చేస్తారు. అలాగే మెట్రో స్టేషన్లను కూడా అనుసంధానం చేసి, పర్యాటకులను, ప్రయాణికులను అధిక సంఖ్యలో ఆకట్టుకునే విధంగా బస్సులను సరికొత్త రూపంలో తయారు చేయిస్తున్నారు.