న్యూఢిల్లీ : మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు వేయనున్న నేపథ్యంలో.. టీకాల కోసం బారులు తీరొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. టీకాలు వచ్చిన వెంటనే తెలియజేస్తామని, అఅప్పుడే రావాలని సూచించారు. టీకాల కొరత కారణంగా పలు రాష్ట్రాలు ఇప్పటికే మూడో విడుత వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించలేమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీకి అవసరమైన టీకాలు రాలేదని, కంపెనీలతో నిరంతరం సంప్రదిస్తున్నామని తెలిపారు. కొవిషీల్డ్ మూడు లక్షల మొదటి డోసులు, వ్యాక్సిన్లు శనివారం లేదా ఆదివారం వస్తాయని ఆశిస్తున్నామని.. ఈ మేరకు కంపెనీ సైతం హామీ ఇచ్చిందని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో రెండు కంపెనీల నుంచి 67లక్షల మోతాదుల చొప్పున అందుబాటులో ఉంచాలని సీరం, భారత్ బయోటెక్ సంస్థలను కోరినట్లు చెప్పారు. ఆ లోపు ప్రజలకు టీకాలు వేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.