ఎదులాపురం, డిసెంబర్ 1 : ఎయిడ్స్ బాధితులపై వివక్ష చూపించొద్దని, వారికి ధైర్యం చెప్పి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ‘ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ రహిత సమాజంతో పాటు బాధితులకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డీఎల్ఎస్ఏ కార్యదర్శి మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధికి ఇంకా మందులు రాలేదని, కొన్ని జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు. బాధితులను చులకనగా చూడవద్దని, వారికి ధైర్యం చెప్పాలన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బాధితులకు న్యాయ పరమైన సేవలు అందిస్తామని చెప్పారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఎయిడ్స్పై అవగాహన పెంచడానికి, వ్యాధితో మరణించిన వారికి సంతాపాన్ని తెలియజేయడానికి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అసాంఘిక లైంగిక సంభోగం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఎయిడ్స్ రహిత సమాజ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. రిమ్స్లో అన్ని ఏర్పాట్లు చేశామని, మరిన్ని అవసరాలకు అనుగుణంగా సేవలు అందిచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన డిగ్రీ కళాశాల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సాధన, రిమ్స్ వైద్యుడు తిప్పస్వామి, డీఐవో వైసీ శ్రీనివాస్, అడిషనల్ డీఎంహెచ్వో శ్రీకాంత్, ప్రోగ్రాం ఆఫీసర్లు విజయసారథి, పవన్ కుమార్, వైద్యసిబ్బంది అనిల్, మధుసూదన్ రావు, వివిధ పీహెచ్సీల సీవోలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ నెల 18న జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించననున్నట్లు డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ముఖ్యఅతిథులు, దివ్యశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ధరావత్ ప్రవీణ్ నాయక్తో కలిసి ఆవిష్కరించారు. దత్తా మెఘే ఉన్నత విద్యాసంస్థ, అనుసంధాన సంస్థానం సహకారంతో సావంగి మెఘే వైద్యశాల, వార్ధా, దివ్యశ్రీ ఫౌండేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.