బెంగళూర్ : కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన సమయంలో మహిళలు, బాలికలపై గృహహింస, వేధింపుల కేసులు అధికమయ్యాయి. లాక్డౌన్ అమలైన రోజుల్లో బెంగళూర్ నగరంలో గృహహింస కేసులు, బాలికలపై వేధింపులు మూడు రెట్లు పెరిగాయని వనితా సహాయవాణి, పరిహార్ కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రం వెల్లడించాయి. కరోనా సెకండ్వేవ్ ముంచెత్తిన సమయంలో గత ఏడాదితో పోలిస్తే తమకు బాధితుల నుంచి మూడు రెట్లు అధికంగా కాల్స్ వచ్చాయని ఈ సంస్ధలు పేర్కొన్నాయి.
బాధితుల నుంచి ఫోన్ కాల్స్ వెల్లువతో తమ కౌన్సెలర్లు విరామం తీసుకోకుండా పనిచేస్తున్నారని పరిహార్ హెల్స్లైన్ ఇన్చార్జ్ రాణి షెట్టి తెలిపారు. తల్లితండ్రుల వేధింపులు తట్టుకోలేని ఓ బాలిక మంగళవారం తమకు ఫోన్ చేయగా తాము వారి తల్లితండ్రులు, బాలికను కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చామని వివరించారు. గత ఏడాది తనకు తల్లితండ్రులు ఇష్టం లేని పెండ్లి చేయగా తాను వైవాహిక బంధం నుంచి బయటపడ్డానని ఆమె వెల్లడించిందని చెప్పుకొచ్చారు. తనకు మరొకరితో ప్రేమ వ్యవహారం ఉందనే అనుమానంతో తల్లితండ్రులు తనను ఇంట్లో నిర్బంధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిందని అన్నారు.
వరకట్న వేధింపులు, గృహహింస, వివాహేతర బంధాలకు సంబంధించి అత్యధిక కేసులు వచ్చాయని వీరికి ఫోన్లోనే తాము కౌన్సెలింగ్ ఇచ్చేవారమని, ఇటీవల వ్యక్తిగతంగానూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. లాక్డౌన్ సమయంలో పలువురు మహిళలు భర్త, అత్తింటి వారి వేధింపులపై ఫిర్యాదులు చేశారని కొన్ని కేసుల్లో తాము పోలీసుల సాయం తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయించామని చెప్పారు.మరికొన్ని కేసులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించామని చెప్పారు.