ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు లాభపడటం సూచీల్లో జోష్ పెంచింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 462.26 పాయింట్లు లాభపడి 52,727.98 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 644 పాయింట్లు లాభపడి 52,909.87 వద్దకు చేరుకున్న సూచీ చివరకు ఇంతటి స్థాయి లాభాలను నిలుపుకోలేకపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 142.60 పాయింట్లు అందుకొని 15,699.25 వద్ద ముగిసింది. వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్, నిఫ్టీలు రెండు శాతానికి పైగా అధికమయ్యాయి.
మదుపరులు లాభాల జడివానలో తడిసిముద్దవుతున్నారు. గడిచిన రెండు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 905 పాయింట్లు ఎగబాకింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,06,975.56 కోట్లు పెరిగి రూ.2,42,27, 901.56 కోట్లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లు ర్యాలీ కారణంగా దేశీయ సూచీలు పరుగు పెడుతున్నాయని మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.