న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఉద్యోగుల వలసలతో దేశీయ ఐటీ దిగ్గజాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఐటీలో ప్రపంచ దేశాలకు సేవలు అందిస్తున్న సంస్థలు మాత్రం సిబ్బందిని కాపాడుకోలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. సిబ్బందిని నిలువరించడంలో విఫలంకావడంతో ఆయా సంస్థలు నూతన సిబ్బందిని రిక్రూట్ చేసుకునే పనిలో పడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజాల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ఏకంగా 50 వేల మంది సిబ్బందిని నియమించుకున్నాయి.
అంటే వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చును. ఇప్పటికే మార్జిన్ల ఒత్తిడితో సతమతమవుతున్న సంస్థలు.. ఖర్చులను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ముఖ్యంగా సిబ్బంది వేతనాల పెంపునకు విరామం పలికిన సంస్థలు..అలవెన్స్లు, ఇతర ఖర్చులను కట్ చేశాయి. వేరియబుల్ చెల్లింపుల్లో భారీ కోతలు పెట్టాయి కూడా. భారత్లో రెండో అతిపెద్ద సంస్థయైన ఇన్ఫోసిస్లో ఉద్యోగుల వలసలు 28.4 శాతంగా నమోదయ్యాయి. ఐటీ ఇండస్ట్రీలో ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. అలాగే విప్రోలో 23.3 శాతం ఉండగా, టెక్ మహీంద్రాలో 22 శాతం ఉన్నాయి. అలాగే టీసీఎస్లో వలసలు గతేడాది చివరి త్రైమాసికంలో నమోదైన దాంతో పోలిస్తే 2.3 శాతం పెరిగి 19.7 శాతానికి చేరుకున్నాయి.
రెండేండ్లలో మారుతున్నారు..
ఐటీ ఉద్యోగులు తరుచుగా కంపెనీలు మారుతున్నారు. రెండేండ్లకు మించి ఒక్క సంస్థల్లో పనిచేయడం లేదు. ఐటీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు తోడు, ప్రతిభ ఉన్న వారికి డిమాండ్ అధికంగా ఉండటం, అత్యధిక వేతనం ఆఫర్ చేస్తున్న సంస్థలకు జై కొడుతున్నారు. ప్రతియేటా లక్షల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు బయటకు వస్తుండటంతో వీరిలో ప్రతిభ ఉన్నవారు అతిపెద్ద సంస్థల్లో చేరడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఐటీ వర్గాలు వెల్లడించాయి.