న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఉద్యోగుల వలసలతో దేశీయ ఐటీ సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గడిచిన ఏడాదికాలంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీ సంస్థల వలసల రేటింగ్ సరాసరిగా 25 శాతానికి పైగా నమోదయ్యాయి. ఉద్యోగ కల్పన అంతంత మాత్రంగానే ఉండటం, మరోవైపు వలసలు ఎక్కువగా ఉండటంతో ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఉద్యోగులు ఏడాదిలోగానే ఇతర సంస్థలోకి జంప్ అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ లోనే వలసలు అత్యధికంగా ఉన్నాయని, ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలు అందిస్తుండటంతో సిబ్బందికి డిమాండ్ పెరిగింది. ప్రతిభ కలిగిన సిబ్బందికోసం ఎంతైనా జీతం ఇవ్వడానికి సంస్థలు సిద్ధంగా ఉండటం కూడా ఇందుకు కారణం.
సిబ్బందిని తీసేస్తున్న సంస్థలు
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు భారీ స్థాయిలో ఉద్యోగులను తీసివేశాయి. నియామకాలకు ఎర్రజెండా పెట్టిన సంస్థలు..మరోవైపు, నైపుణ్యం లేని వారిని తొలగిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద చిప్ల తయారీ సంస్థ ఇంటెల్ ఏకంగా వెయ్యి మందిని తీసివేయడానికి సిద్ధమైంది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
‘దీర్ఘకాలికంగా ఐటీ రంగం వలసల సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నది. గత కొన్ని త్రైమాసికాల్లో మరింత పెరిగింది. ఉన్నత స్థాయి ఉద్యోగులు సంస్థను వీడి ఇతర సంస్థల్లో అత్యధిక జీతానికి చేరుతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, స్టార్టప్లలో టెక్కీలకు డిమాండ్ ఉండటం ప్రధాన కారణం’
– నీతి శర్మ, టీమ్లీజ్ ఎడ్యుటెక్ ప్రెసిడెంట్