Dolo-650 | ప్రముఖ పెరసిటమాల్ టాబ్లెట్ `డోలో-650` తయారీ దారులు.. దాని ప్రమోషన్ కోసం వైద్యులకు రూ.1000 కోట్ల విలువైన ఉచిత బహుమతులు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై డోలో-650 తయారీదారులపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చేసిన ఆరోపణలను ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటెటివ్స్ అసోసియేషన్ (ఎఫ్ఎంఎస్ఆర్ఏ) సీనియర్ న్యాయవాది సంజయ్ పరీఖ్ ధృవీకరించారు. ఏదేనీ 500 ఎంజీ టాబ్లెట్కు ధరను ప్రభుత్వ నియమిత కమిటీ ఖరారు చేస్తుందని సుప్రీంకోర్టుకు చెప్పారు.
కానీ 500 ఎంజీ కంటే ఎక్కువ మోతాదు కల డోలో-650 యజమానులే దాని ధరను ఖరారు చేశారని సంజయ్ పరీఖ్ పేర్కొన్నారు. అధిక లాభాలు గడించేందుకు వీలుగా రోగులకు డోలో-650 ప్రిస్క్రైబ్ చేయడానికి డాక్టర్లకు ఉచిత బహుమతులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇటువంటి అంశం తీవ్రమైందని వ్యాఖ్యానించింది.
కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నట్రాజ్ను పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయడానికి వైద్యులకు ఉచిత ఇన్సెంటివ్లు ఇచ్చే ఫార్మాస్యూటికల్ సంస్థలను శిక్షించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని గురువారం న్యాయస్థానం విచారించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చేనెల 29కి వాయిదా వేసింది.