భోపాల్: ఆసుపత్రిలోని బెడ్పై ఒక కుక్క నిద్రిస్తుండగా, రోగులు, వారి వెంట ఉండే సహాయకులు నేలపై కూర్చొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. గ్వాలియర్లోని కమలా రాజా హాస్పిటల్లో ఖాళీగా ఉన్న బెడ్పై ఒక కుక్క నిద్రిస్తూ కనిపించింది. మరోవైపు కొందరు రోగులు, వారి సహాయకులు నేలపై కూర్చొన్నారు. ఒకరు రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకవైపు దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుదలపై అంతటా ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్న ఇలాంటి ఘటనలపై విమర్శలు వినిపిస్తున్నాయి.
కాగా, దీని గురించి తనకు తెలియదని ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ మీడియాతో అన్నారు. తాను ఇవాళే జాయిన్ అయినట్లు ఆమె చెప్పారు. తాను సెలవులో ఉన్నట్లు ఆసుపత్రికి చెందిన మరో అధికారి తెలిపారు. మరోవైపు ఆసుపత్రి ఇన్చార్జ్ మాత్రం ఈ ఘటనపై స్పందించారు. దీనిపై విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.