రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించే అధికారంగానీ, హక్కుగానీ గవర్నర్కు ఉన్నదా? రాష్ట్ర అసెంబ్లీకి రాజ్యాంగబద్ధ అధికారిక, నామమాత్రపు అధిపతి అయిన గవర్నర్కు సభను సమావేశపరచడం, ఉభయసభల సంయుక్త సమావేశంలో బడ్జెట్ ముందు తప్పనిసరిగా ప్రసంగించే అధికారం ఉందా? ఇప్పుడీ ప్రశ్నలు తెలంగాణలో చర్చనీయాంశాలైనాయి.
ఎంపీ జైన్ ‘భారత రాజ్యాంగ చట్టం’ పుస్తకంలో (పేజీ 328లో) పేర్కొన్నట్టు శాసనసభ మొట్టమొదటి సమావేశానికి గవర్నర్ ప్రసంగం తప్పనిసరి. గవర్నర్ పిలువకుండా, ప్రసంగం లేకుండా శాసనసభ్యులు సమావేశమైనా అది చట్టబద్ధం కాదు. సాధారణంగా ప్రభుత్వ విధానాలు, పథకాల గురించి వివరించి శాసనసభ సమావేశానికి అజెండాను గవర్నర్ ప్రసంగం ప్రతిపాదిస్తుంది. అయితే, గవర్నర్ ప్రసంగం తప్పనిసరిగా ఉండాల్సిన ఆదర్శ సంప్రదాయం ఏమీ కాదని కోర్టులు పేర్కొన్నాయి. నిజానికి ఇటువంటి సంప్రదాయాలు కూడా రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నవాళ్ళు తమ తమ రాజ్యాంగ విధులను సరైన రీతిలో నిర్వహించినప్పుడే వర్తిస్తాయి. సమయానుసారం శాసనసభను సమావేశపర్చే అధికారం గవర్నర్కు ఉన్నదని రాజ్యాంగం చెప్తున్నది. దీనర్థం క్షుణ్ణంగా తెలియాలంటే.. 174, 175, 176 అధికరణలను పూర్తిగా అర్థం చేసుకోవాలి.
అధికరణం174 (1) ప్రకారం గవర్నరు శాసనసభ ఉభయసభలను విడివిడిగా లేదా కలిపి సమయానుసారం అనుకూలమైనదని భావించి నిర్ణయించిన స్థలంలో, సమయంలో, అంతకుముందు విడత సదస్సులోని చివరి సమావేశానికి, మలివిడత సదస్సులోని తొలి సమావేశానికి మధ్య ఆరు నెలల కాలవ్యవధి మించకుండా శాసనసభ తదుపరి సదస్సును సమావేశ పరచాలి. 174(2) ప్రకారం గవర్నర్ సమయానుసారం శాసనసభ సదస్సు ఒక విడత సమావేశాల్ని ముగిసిందని ప్రకటించవచ్చు (ప్రోరోగ్) లేదా శాసనసభను రద్దుచేయవచ్చు (డిజల్యూషన్).
అధికరణం 175 లో శాసనసభలో గవర్నర్ ప్రసంగించడం గవర్నర్ హక్కు అని శీర్షిక స్పష్టంగా పేర్కొన్నది. కాని తరువాతి వాక్యాలలో may అన్న పదప్రయోగం వల్ల అది తప్పనిసరి కాదనే అర్థం వస్తుంది. అంటే గవర్నర్ ప్రసంగం ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని అర్థం.
అధికరణం 175 (1) గవర్నర్ శాసన ఉభయ సభలను విడివిడిగా, లేదా సంయుక్తంగా కలిపి ప్రసంగించదలచుకున్నపుడు ఆసమావేశానికి రమ్మని సభ్యులను పిలువవచ్చు. అధికరణం 175 (2)- పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి, ఇంకేదైనా విషయం గురించి, లేదా ఉభయ సభలు తప్పనిసరిగా చర్చించవలసిన విషయాలున్నాయని తాను భావించినప్పుడు గవర్నర్ తన సందేశంలో శాసనసభ ఉభయ సభలకు గానీ విడివిడిగా గానీ తాను సరైనదిగా భావించిన విధంగా సందేశాన్ని పంపవచ్చు.
అధికరణం 176 గవర్నర్ ప్రత్యేక ప్రసంగం గురించి వివరిస్తుంది. 1950 నాటి తొలి రాజ్యాంగం అధికరణం 176 ప్రకారం గవర్నర్ ప్రతి విడత సమావేశంలో తొలి ప్రసంగం తప్పనిసరిగా చేయాలని ఉంది. కానీ 1951 లోనే ఈ అధికరణాన్ని సవరించి, సాధారణ ఎన్నికల తరువాత జరిగే తొలి విడత శాసనసభ సమావేశాలను, తరువాత ప్రతి సంవత్సరం జరిపే తొలి విడత శాసనసభ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించి తీరాలని పేర్కొన్నారు. అంటే అది తప్పనిసరి. గవర్నర్ హక్కు, అధికారం అవుతుంది. అధికరణాలు 174, 175 కలిపి చదివినప్పుడు సమయానుసారం శాసనసభను సమావేశపర్చే అధికారం గవర్నర్కు ఉన్నదని అర్థమవుతున్నది. కానీ ఇది అపరిమిత అధికారం కాదు. దీని పైన పెద్ద పరిమితిని రాజ్యాంగంలోని 163వ అధికరణం విధించింది. సమావేశం కావాలని అసెంబ్లీని పిలిచే అధికారం, అందులో ప్రసంగించే అధికారం ఉన్నా కూడా గవర్నర్ కేవలం రాష్ట్రమంత్రి మండలి సలహామేరకే వ్యవహరించవలసి ఉంటుంది. గవర్నర్ సొంతంగా నిర్ణయం తీసుకునే వీల్లేదు. శాసనసభ సమావేశ కాలం, అజెండా, నిర్వహణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశపు సలహా మేరకే గవర్నర్ శాసనసభను సమావేశపర్చవలసే తేదీ స్థలాల నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
వాయిదాలు నాలుగువిధాలు. 1.ప్రోరోగ్- శాసనసభను ఒక విడుత సమావేశాన్ని పూర్తిగా ముగించడానికి వాడుతారు. పెండింగ్ నోటీసులు, బిజినెస్ గడువుతీరిపోతాయి. 2. సభ ఒక విడత సదస్సులో తదుపరి సమావేశ తేదీని పేర్కొనకుండా నిరవధికంగా వాయిదా వేస్తే అడ్జర్డ్న్ సైనె డై అంటారు. నిరవధిక వాయిదా పడిన తర్వాత మంత్రివర్గ సలహా మేరకు గవర్నర్ ప్రోరోగ్ నోటిఫికేషన్ ఇస్తారు. 3. లేకపోతే తదుపరి సమావేశం తేదీని శాసనసభ కార్యాలయం నిర్ణయించవచ్చు. అటువంటి తర్వాతి సమావేశాన్ని (మీటింగ్) ను పూర్వ విడత సదస్సు సమావేశాలకు కొనసాగింపుగా భావిస్తారు. 4. అడ్జర్న్ మెంట్’ను అంటే సమావేశాన్ని కొన్ని గంటలు లేదా, రోజుల పాటు తదుపరి సమావేశం తేదీ, సమయం ప్రకటించినప్పుడు వాడుతారు. ఇక ‘డిజల్యూషన్’- ఇది సభను పూర్తిగా రద్దుచేయడానికి వాడుతారు. అన్ని పెండింగ్ బిల్లులు దీంతో రద్దవుతాయి.
తెలంగాణ రెండో శాసనసభ ఎనిమిదో విడత సదస్సు చివరి సమావేశం 2021 చివరి భాగంలో జరిగింది. దాని తరువాత సమావేశం ఎప్పుడో శాసనసభ పాలనా యంత్రాంగం నిర్ణయిస్తుంది. తెలంగాణలో కొన్ని నెలల కిందట జరిగిన శాసన సభ సమావేశాల్లో శాసనసభను ‘ప్రోరోగ్’ చేయలేదు. ‘అడ్జర్న్ సైన డై’ మాత్రమే చేశారు. అంటే చివరి విడుతను ముగించలేదు. అంటే సాంకేతికంగా మళ్లీ గవర్నర్ సభను హాజరుపర్చనవసరం లేదు. కాబట్టి గవర్నర్ ఆదేశంతో పనిలేకుండా సభాపతి ఆదేశాల మేరకు శాసనసభ కార్యాలయాధికారుల ద్వారా తర్వాతి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 2022 ఫిబ్రవరి 28నాడు ఒక ప్రకటనలో తెలంగాణ శాసనసభా కార్యదర్శి వి.నరసింహాచార్యులు శాసనసభ 8వ విడతలోని రెండవ దఫా సమావేశం మార్చి 7న జరుగుతుందని తెలియచేశారు. సాంకేతికంగా పదాల అర్థాన్ని బట్టి మార్చి 7న జరిగే సమావేశం, 2022 సంవత్సరంలోని తొలి సదస్సులోని తొలి మీటింగ్ కాదనుకోవచ్చు. నియమాలకు అనుగుణంగా ఉన్నా ఉద్దేశ్యాలను అర్థం చేసుకుని నియమాలను మౌలిక లక్ష్యాల ప్రకారం అమలు చేయవలసిన బాధ్యత ఉంటుంది.
నియమిత రాజ్యాంగ పాలకుడు గవర్నర్. ఎన్నికైన ప్రజాప్రతినిధి హోదాలో పాలించే రాజ్యాంగ అధికార నాయకులు ముఖ్యమంత్రి. ఇద్దరూ కలిసి సయోధ్యతో, సమన్వయంతో పాలన నడపాలని, ఒకరి అధికారాల మీద మరొకరికి చెక్ అధికారం ఉంటుందని రాజ్యాంగ పిత అంబేద్కర్ ఆశించారు. అది అందరూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినప్పుడే సాధ్యం అవుతుంది.
(వ్యాసకర్త: కేంద్ర మాజీ సమాచార కమిషనర్)
– మాడభూషి శ్రీధర్
84476 51505