లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యాచారాలు, హత్యలకు అడ్డగా మారింది. ఆ రాష్ట్రంలో నేరాలు నిత్యకృత్యం అయ్యాయి. రోజూ ఏదో ఒకచోట హత్యనో, అత్యాచారమో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణం వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో జిల్లాలోని బస్తీ ఏరియాలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువతిని ఆస్పత్రికి పిలిచి ముగ్గురు వైద్యులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నేరానికి పాల్పడిన ముగ్గురు వైద్యుల్లో ఒకరితో బాధితురాలుకు పరిచయం ఉంది. సోషల్ మీడియా ద్వారా వాళ్లు స్నేహితులయ్యారు. ఈ క్రమంలో సదరు వైద్యుడు యువతిని ఆస్పత్రికి ఆహ్వానించాడు. నమ్మి వచ్చిన యువతిని అతను తన హాస్టల్ రూమ్కు తీసుకెళ్లాడు. అక్కడ తన సహోద్యోగులైన మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు లక్నో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగుచూసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.