తిరుమల, జూలై: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ప్రతి ఏటా ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీవారి పాదాల వద్ద తిరుమల తిరుపతి దేవస్థాన అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తున్నది.
ఎందుకు చేస్తారంటే..?
తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉన్నది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింతగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.