దేవాలయం అనగానే హారతులు, ప్రత్యేకపూజలు మనం చూసి ఉంటాం. కొన్ని ఆలయాల్లో అక్కడి ఆచారాన్ని బట్టి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అందుకు భిన్నంగా బిస్కెట్లు, చాక్లెట్లు మాంసం, చేపలు, మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే దేవాలయం ఒకటి ఉందని మీకు తెలుసా? వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. కాశీ (వారణాసి)లో ఉన్నబాబా బాతుక్ భైరవ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడి బాబా బాతుక్ భైరవ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు పిల్లలైతే బిస్కెట్లు, చాక్లెట్లు సమర్పిస్తే, పెద్దవాళ్లు మాంసం, మద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఇక్కడ మహాదేవుడు… మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. సాత్విక రూపం, రజస్వ రూపం, తామస రూపం. ప్రత్యేక పండుగ దినాల్లో స్వామిని మూడు రూపాల్లో అలంకరిస్తారు. ఉదయం వేళ చిన్నారి స్వామిగా భావిస్తూ… చాక్లెట్లు, బిస్కెట్లు, పండ్లు ఇస్తారు. చాలా మంది వీటిని పిల్లల చేత ఇప్పిస్తారు. ఇక మధ్యాహ్నం వేళ పప్పు, రైస్, బ్రెడ్, కూరగాయలను సమర్పిస్తారు. రాత్రి మాత్రం మహా హారతి తర్వాత… మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చేపల కర్రీ, మద్యం సమర్పిస్తారు. వాటితోపాటూ… ఎగ్ ఆమ్లెట్ కూడా భైరవుడి రూపంలోని స్వామికి సమర్పిస్తారు.
పిల్లాడి రూపంలో ఉన్న బాతుక్ స్వామి బిస్కెట్లు ఆరగించాక మధ్యాహ్నం వస్త్రాలను మార్చేస్తారు. అప్పుడు స్వామి రాయల్ రూపంలో దర్శనం ఇస్తారు. సూర్యాస్తమయం తర్వాత రాత్రి వేళ రూపంలో స్వామి చూడటానికి అరివీర భయంకరంగా ఉంటారు. ఉగ్ర రూపంతో కనిపిస్తారు. ఆ రూపంలో స్వామికి వైన్తో పూజలు చేస్తారు. అక్కడి దీపం ఎప్పుడూ కొండ ఎక్కకుండా చూసుకుంటారు. ఈ ఆలయానికి వెళ్లే పర్యాటకులు ఉదయం నుంచి రాత్రి వరకూ అక్కడే ఉంటారు. మొత్తం మూడు రూపాల్లో స్వామికి సమర్పించే కానుకలను చూసి ఆశ్చర్యపోతారు. ఉదయం వేళ చిన్నారిగా ఉండే స్వామి చాలా పవర్ ఫుల్ అట. తన భక్తుల కష్టాలు, కన్నీళ్లను స్వామి కచ్చితంగా దూరం చేస్తారని భక్తులు నమ్ముతారు. అందువల్లే ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా రాత్రివేళ రద్దీ బాగా పెరుగుతుంది.