అమరావతి, జూన్ 3: ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా నివారణకు ఆనందయ్య ఇచ్చే మందులు అందుబాటులోకి రానున్నాయి. ఆనందయ్య మందుకోసం దళారులను నమ్మి మోసపోవద్దని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి చెప్పారు. ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి, సొమ్ము చేసుకోవాలని చూస్తే, ఎంతటి వారిపై నైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ విషయంలో పూర్తి నిర్ణయాధికారం ఆనందయ్యదే తప్ప, ప్రభుత్వానికి గానీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వస్తు రూపంలో ఇవ్వడం కానీ, ఆర్థిక సహాయం అందించాలన్న వారు గానీ వారు నేరుగా ఆనందయ్యకు తప్ప, మధ్యలో మరెవ్వరికీ, ఎంతటివారినైనా నమ్మి ఇవ్వవద్దని కాకాని పేర్కొన్నారు.