కేంద్రానికి మేఘాలయ గవర్నర్ విజ్ఞప్తి
బాఘ్పట్ (యూపీ): నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని నిరసనోద్యమం చేస్తున్న అన్నదాతల పట్ల వైఖరి మార్చుకోవాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులను కించపరుస్తూ, వారిని ఆవేదనకు గురిచేయవద్దని హితవు పలికారు. అన్నదాతల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఉత్తరప్రదేశ్లోని బాఘ్పట్లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాల్ మాట్లాడారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు సంబంధించి చట్టపరమైన హామీని ఇస్తే, రైతులు తమ ఉద్యమాన్ని ఉపసంహరించుకుంటారని పేర్కొన్నారు. ఇన్ని రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న అన్నదాతలను ఒట్టి చేతులతో వెనక్కి పంపించవద్దని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కోరారు.