చెన్నై : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన “మీ తమిళనాడు” వ్యాఖ్యలపై పాలక డీఎంకే పత్రిక మురసోలి మండిపడింది. లోక్సభలో ఆగస్ట్ 1న ధరల మంటపై జరిగిన చర్చకు బదులిస్తూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ తరచూ ఆరోపిస్తోందని అయితే మీ తమిళనాట డేటా సెంటర్లను నెలకొల్పేందుకు అదానీతో తమిళనాడు ప్రభుత్వం రూ 35,000 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకాలు చేసిందని నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడులో కాంగ్రెస్ పాలక డీఎంకే భాగస్వామ్య పక్షంగా కొనసాగుతోంది. మురసోలి సంపాదకీయం నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మీ తమిళనాడు అనేంత దూరం వెళ్లేలా ఆమె నిగ్రహాన్ని కోల్పోయారని ఆక్షేపించింది.
తమిళం మాట్లాడేవారంతా తమిళులు కారని పేర్కొంది. నిర్మలా సీతారామన్ తమిళనాడులో పుట్టిపెరిగి తమిళం బాగా మాట్లాడగలరు. దేశ ఆర్ధిక పరిస్ధితులను అర్ధం చేసుకునేందుకు ఆర్ధిక మంత్రి సంయమనం పాటించాలని సంపాదకీయం హితవు పలికింది. తమిళనాడు వల్ల మీరు ఎందుకు రెచ్చిపోతున్నారు,” అని సంపాదకీయం పేర్కొంది, “దేశ ఆర్థిక పరిస్థితుల గురించి” వాస్తవాన్ని గుర్తించడానికి “సంయమనం” కొనసాగించాలని సీతారామన్ను కోరింది. నిధులను తర్వాత ఎలాగైనా సమీకరించవచ్చని, ఆమె సంయమనంతో వ్యవహరిస్తేనే బీజేపీ హయాంలో దేశ ఆర్ధిక పరిస్ధితికి సంబంధించిన వాస్తవాలను అర్ధం చేసుకోగలరని పేర్కొంది.
నిర్మలా సీతారామన్ ఇలాగే ఉద్రేకంతో వ్యవహరిస్తే ఆమె వాస్తవాలను ఎన్నటికీ అర్ధం చేసుకోలేరని తెలిపింది. బియ్యం సహా ప్యాకేజ్డ్ ఆహార పదార్ధాలపై 5 శాతం జీఎస్టీ విధించే నిర్ణయాన్ని నిరసిస్తూ తమిళనాడు, కేరళ సహా యూపీ, కర్నాటక వంటి బీజేపీ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రైస్ మిల్లర్లు నిరసనలు తెలిపారని పేర్కొంది. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉంటే ఆర్ధిక వ్యవస్ధ పటిష్టంగా ఉన్నట్టు ఆర్ధిక మంత్రి పేర్కొనడం హాస్యాస్పదమని మురసోలి ఎడిటోరియల్ వ్యాఖ్యానించింది. పన్ను వసూళ్లు, ఆర్ధిక ఆరోగ్య పరిస్ధితికి సంబంధం లేదని స్పష్టం చేసింది.