(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ) : సంక్షేమ పథకాల అమల్లోనే కాదు.. నిబంధనలకు విరుద్ధంగా హద్దుమీరి రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే వారిపట్ల ఎలా వ్యవహరించాలో కూడా మిగతా రాష్ర్టాలకు తెలంగాణ ఒక మార్గదర్శకంగా నిలిచింది. తమిళనాడులోని అధికార డీఎంకే పత్రిక ‘మురసోలీ’ సోమవారం ప్రచురించిన ఓ కథనం ఇందుకు తార్కాణం. ‘రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాలు, ఇతర వ్యవహారాల్లో తలదూరుస్తూ అడ్డుపుల్లలు వేసే గవర్నర్లు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ విషయంలో తెలంగాణ సర్కారు వ్యవహరించిన తీరు సమర్థనీయం. ఇక్కడ (తమిళనాడు) కూడా అలాంటి పరిస్థితులే ఎదురైతే, చర్యలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి’ అంటూ ఆ పత్రిక ఓ సుదీర్ఘ వ్యాసాన్ని రాసింది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని గవర్నర్లు ఇకనైనా మానుకోవాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి పరోక్షంగా హితవు పలికింది. ‘అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను రాష్ట్రపతికి పంపించకుండా తన దగ్గర అట్టే పెట్టుకొనే గవర్నర్ (ఆర్ఎన్ రవి) చర్యలను ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అంగీకరించదు. ప్రజాప్రయోజన పథకాలకు విరుద్ధంగా గవర్నర్లు ప్రవర్తించవద్దు. అదే జరిగిన నాడు.. తెలంగాణ గవర్నర్ సౌందర్రాజన్ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుగానే చేయాల్సి ఉంటుంది’ అని ఆ వ్యాసంలో హెచ్చరించింది. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై జరిగిన వివాదాన్ని ఈ మేరకు ప్రత్యేకంగా ఉదహరించింది. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడమే కేంద్రప్రభుత్వానికి లక్ష్యంగా మారిందని ధ్వజమెత్తింది. కేంద్రం ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులకు గురికావొద్దని పేర్కొంది. గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా పనిచేయడం మారేసి.. రాష్ర్టాలు, కేంద్రం మధ్య సమన్వయానికి కృషిచేయాలని హితవు పలికింది. కాగా, గవర్నర్ ప్రసంగంలేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించారని బీజేపీ నేతలు రాద్ధాంతం చేశారు. కానీ, ప్రొరోగ్ కాకుండా కేవలం వాయిదా పడ్డ సమావేశాలను తిరిగి కొనసాగించిన సందర్భంలో గవర్నర్ ప్రసంగం అవసరంలేదని రాజ్యాంగ నిపుణులు వివరించడం తెలిసిందే.
కథనంపై ఢీ అంటే ఢీ
‘మురసోలీ’లో ప్రచురితమైన వ్యాసంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. పక్క రాష్ట్రంలో తనను కొందరు అగౌరవ పరిస్తే, తమిళనాడులోని మరికొందరు సంతోషించడం ఆశ్చర్యంగా ఉన్నదని అన్నారు. ‘నాకేమీ అవమానం జరుగలేదు. నేనేమీ చలించట్లేదు. పరాక్రమపూరితమైన తమిళ వారసత్వాన్ని పొందిన బిడ్డను నేను. కానీ, పక్క రాష్ట్రంలో సోదరిని అగౌరవపరిస్తే, తమిళనాడులో కొందరు సంతోషపడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇది సరైన ఆలోచన విధానం కాదు’ అని తిరుచిరాపల్లిలో మీడియాతో అన్నారు. కాగా, గవర్నర్ వ్యాఖ్యలపై బుధవారం ‘మురసోలీ’ మరో కథనాన్ని ప్రచురించింది.
తెలంగాణలో స్పందించకుండా తమిళనాడుకు వచ్చి గవర్నర్ పరాక్రమ వ్యాఖ్యలు చేయడమేమిటని వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. దీన్ని ధైర్యవంతుల చర్యగా అనుకోవాలా? అని ప్రశ్నించింది. గవర్నర్ను అమాయకురాలిగా అభివర్ణించింది. మరోవైపు, తమిళిసై వ్యాఖ్యలపై తెలంగాణవాదులు కూడా మండిపడుతున్నారు. తెలంగాణ సర్కారుపై అకారణంగా నిందలు వేసినప్పుడు గవర్నర్ ఆలోచనా విధానాన్ని ఏ విధంగా సమర్థించుకొంటారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ గతంలో చేసిన విమర్శల వీడియోలను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాలను కూలదోయడం, అది కుదరకపోతే గవర్నర్ల ద్వారా ఆ ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు నిత్యకృత్యంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలోనూ ఇదే తర హా వ్యూహాన్ని కమలదళం అమలు చేస్తున్నది. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ద్వారా రాష్ట్రప్రభుత్వంపై వీలు చిక్కినప్పుడల్లా తీవ్ర విమర్శలు గుప్పించేలా కుట్రలు అమలు చేస్తున్నది.