హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపే లక్ష్యంగా మనమంతా పనిచేయాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ క్రమంలో భాగంగానే 3,400 మంది కార్యకర్తలతో డివిజన్ వారీగా ఇన్ఛార్జీల నియామకం అదేవిధంగా ప్రతీ 50 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఒక కమిటీని పార్టీ బాధ్యులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా టీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కమిటీలతో గురువారం నగరంలోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని లక్షా 53 వేల పైచిలుకు ఓటర్లను కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించేలా కార్యాచరణను రూపొందించారు.
మంత్రి గంగుల మాట్లాడుతూ.. ప్రతిభను గుర్తించడంలో ముందుండే మన సీఎం కేసీఆర్ నేడు పీవీ కుమార్తె, ఉన్నత విద్యావంతురాలు, మచ్చలేని వ్యక్తి సురభి వాణీదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయాన్ని విద్యావంతులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సుస్థిరమైన పాలన, మెరుగైన శాంతిభద్రతలు, కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్లే తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకెళుతూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. ఈ ఆరేళ్లలోనే అరవై ఏళ్లలో తెలంగాణకు చేయలేని అభివృద్దిని మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. వీటన్నింటిని పట్టభద్రులు ఓటువేసే సమయంలో దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.
బీజేపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మోద్దని, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాట్లాడిన జూటా మాటల్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఆరేళ్లలో పట్టభద్రుల సమస్యలపై ఒక్కనాడు మండలిలో ప్రశ్నించని రాంచందర్ రావుని ఎదురు ప్రశ్నించాలని పట్టభద్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల వస్తున్న పెట్టుబడుల గురించి తెలియజేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదటి ప్రాదాన్యతా ఓటు సురభి వాణీదేవికి వేసి గెలిపించాలని కోరారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతీ ఓటరుని కలుసుకొని టీఆర్ఎస్ అభివృద్ది గురించి తెలియజేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాదించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.