హైదరాబాద్ : కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కులను ఈ నెల 15న పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మహమ్మారితో మృతి చెందిన 63 మంది పాత్రికేయుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో జర్నలిస్టులను ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే మార్చి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఏడు నెలల కాలంలో వివిధ కారణాలతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అదే రోజు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కరోనాతో రెండో విడతలో మరణించిన కుటుంబాల నుంచి ఇప్పటి వరకు 63 దరఖాస్తులు వచ్చాయని, ఈ మేరకు ఆయా కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మార్చిలో ఆర్థిక సహాయం అందించిన వారిలో కరోనాతో మరణించిన ముగ్గురు జర్నలిస్టుల కుటుంబాలకు అదనంగా మరో రూ.3లక్షల చెక్కులను అందజేయనున్నట్లు చెప్పారు.
అనారోగ్యం బారినపడి పని చేయలేని స్థితిలో ఉన్న నలుగురు జర్నలిస్టులకు రూ.50వేల చొప్పున చెక్కులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మొత్తం 101 కుటుంబాలకు రూ.1.62కోట్లు పంపిణీ చేస్తున్నట్లు అల్లం నారాయణ వివరించారు. ఆయా కుటుంబాలకు ఐదేళ్ల పాటు రూ.3వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. కరోనా వారియర్స్గా పని చేసిన వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు సైతం వార్తల సేకరణకు గడ్డు పరిస్థితుల్లో పని చేశారని, ఈ క్రమంలోనే వైరస్ బారినపడ్డారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మీడియా అకాడమీ తరఫున కరోనా బారినపడ్డ జర్నలిస్టులను ఆదుకున్నదన్నారు.