నవ దర్శకులే తెలుగు సినిమాకు బలం. ఆ బలగంలో భాగమయ్యారు సాగర్ కె చంద్ర. ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాలు అతని ప్రతిభను చాటాయి. తాజాగా ‘భీమ్లా నాయక్’తో బిగ్ లీగ్లోకి అడుగుపెట్టారు ఆయన. మన కలల్ని తెరపై ఆవిష్కరించేదే సినిమా అంటున్న ఈ దర్శకుడు ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
గత నెలంతా సందడిగా గడిపినట్లున్నారు..!
భీమ్లా నాయక్ మంచి విజయం సాధించింది. ఇప్పటికీ బాగా రన్ అవుతున్నది. ఈ సినిమా విడుదల, ప్రచార కార్యక్రమాలతో కొద్ది రోజులు తీరిక దొరకలేదు. అవన్నీ దర్శకుడిగా నాకు బాగా సంతృప్తినిచ్చాయి.
సక్సెస్లో ఉన్నారు కదా.. సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటున్నారా?
సెల్ఫ్ మార్కెటింగ్ ఎక్కువ చేసుకున్నా ప్రమాదమే. అలాగని స్తబ్ధుగా ఉండిపోవద్దు. ఏది చేసినా మన తర్వాతి సినిమా మీద ప్రభావం చూపిస్తుంది. నిలకడగా నాణ్యమైన సినిమాలు తెరకెక్కిస్తుంటే మన విలువ కాపాడుకోవచ్చు.
ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేసి సినిమాల వైపు ఎలా ఆకర్షితులయ్యారు?
మాది నల్గొండ, నాన్న స్కూల్ నడిపేవారు. చదువు మీద శ్రద్ధ చూపించే వాతావరణంలో పెరిగాను. ఇంజినీరింగ్ వరకు ఇష్టపడి చదివాను. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లినప్పుడు సినిమాల మీదకి దృష్టి మళ్లింది. మా ఇన్స్టిట్యూట్లో మాస్ కమ్యూనికేషన్స్ చదివే వారితో పరిచయం ఏర్పడింది. వాళ్లు బాలీవుడ్ డ్రీమ్స్ అనే డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులో అమితాబ్ బచ్చన్ వెనుకవైపు నుంచి కనిపించే డూప్ షాట్ ఒకటి ఉంటుంది. ఆ షాట్కు నన్ను తీసుకున్నారు. వాళ్ల స్నేహంతో క్రమంగా దర్శకత్వం చేయాలనే కోరిక కలిగింది.
నిర్మాతగా మారాలని అనుకున్నారా ?
అవును, మొదట్లో ఓ పదేండ్ల్లు అమెరికాలో బాగా సంపాదించి ఆ డబ్బుతో ఇక్కడికొచ్చి సినిమాలు నిర్మిద్దాం అనుకున్నాను.
వెళ్లే దారి మార్చుకోవడంలో మీరు పడిన సంఘర్షణ?
మన కలల్ని నెరవేర్చుకునే క్రమంలో సాహసాలు తప్పవు. నేను అమెరికాలో చదువు, ఉద్యోగం మానేసి దర్శకుడు కావాలని వచ్చాను. ఇంట్లో వాళ్లకు మొదట్లో నచ్చకున్నా, తర్వాత అంగీకరించారు. ఎవరైనా సరే, మీ మనసుకు నచ్చిన కెరీర్లోకి వెళ్లాలనుకుంటే ధైర్యంగా వెళ్లండి. అయితే, ఆ కెరీర్ వల్ల ఏం దక్కుతుందా అని ఆశించి మాత్రం వెళ్లొద్దు. ఆ ప్రయాణాన్ని, అందులో ఎదురయ్యే కష్టాలను ఆస్వాదించగలిగితేనే ముందడుగు వేయండి. నా అనుభవంతో చెప్పే సలహా ఇదే.
‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథకు స్ఫూర్తి ఏంటి?
నేను, శ్రీవిష్ణు, నారా రోహిత్ మంచి మిత్రులం. తరుచూ క్రికెట్ ఆడుతుండేవాళ్లం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రైల్వే రాజు పాత్రతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథ రాసుకున్నా. రోహిత్తో సినిమా చేద్దామని ఉండేది. అయితే, అప్పట్లో ఆయన చాలా బిజీ. మూడు సినిమాలు చేస్తున్నాడు. దాంతో మరో మిత్రుడు శ్రీవిష్ణు ‘మనం సినిమా చేద్దాం’ అన్నాడు. ఆ తర్వాత రోహిత్ వచ్చాడు. ఈ సినిమాకు దర్శకరత్న దాసరి గారు ఇచ్చిన ప్రశంస మర్చిపోలేను.
మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?
దర్శకులు రవిబాబు, మధుర శ్రీధర్రెడ్డి దగ్గర సహాయకుడిగా పనిచేశాను. ఆ సమయంలో ‘అయ్యారే’ కథ రాసుకున్నా. డాక్టర్ సుధాకర్ బాబు గారిని కలిసి కథ చెప్పాను. కథ నచ్చి.. మనం ఈ సినిమా చేద్దామంటూ వెంటనే అడ్వాన్స్ ఇచ్చారు. చాలామందికి అతికష్టం మీద దొరికే తొలి సినిమా అవకాశం నాకు సులువుగా లభించింది. ఆ సినిమా విడుదల వరకు సాఫీగానే సాగింది. కానీ, చివరలో ఒక బాబా వేసిన కేసులతో ఇబ్బందులు పడ్డాం. ఆయనకు మా కథకు ఏ సంబంధమూ లేకున్నా ఇబ్బందులు పెట్టారు.
సినిమా కథల్లో స్థానికతకు పెరిగిన ప్రాధాన్యం గురించి ఏం చెబుతారు ?
ఒకప్పుడు సింగరేణి కాలరీస్ నుంచి ఒకరు వచ్చి కథ చెప్పే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ గోదావరిఖని దగ్గర జరిగిన కథతో నాని ‘దసరా’ అనే సినిమా చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పు ఇది. దీన్ని ‘మోర్ లోకల్ మోర్ గ్లోబల్’ అని పిలుస్తున్నారు. ఓటీటీ వచ్చాక కథ స్థానికమైనదే అయినా.. ఎంత బలంగా తెరకెక్కిస్తే అంత వేగంగా ప్రపంచానికి చేరువవుతున్నది. అందుకే స్థానిక కథలకు ప్రాధాన్యం పెరిగింది. కొలంబియాలో జరిగిన నార్కోస్ కథను ఇక్కడ మనం ఆసక్తిగా చూస్తున్నాం.
పవన్ కళ్యాణ్ సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ తీరిక లేకుండా ఉంటారు. అయినా షూటింగ్కు చెప్పిన టైమ్కు వచ్చేస్తారు. ఆయనలో తనో స్టార్నన్న పోకడ కనిపించదు. నటన మీద ఏకాగ్రతతో ఉంటారు. సినిమాకు ఏది కావాలో స్పష్టంగా తెలిసిన వ్యక్తి త్రివిక్రమ్. వీళ్లద్దరిదీ సినిమాకు మించిన స్నేహం. ఒకే చిత్రంలో ఈ ఇద్దరితో కలిసి పనిచేయడం అదృష్టం అనుకుంటా!
సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచిని చెప్పలేమా?
సినిమాలు ఉన్నది సందేశాలు ఇచ్చేందుకు కాదనేది నా అభిప్రాయం. కథలో అంతర్లీనంగా మంచి విషయం ఉంటే దాన్ని చూపించవచ్చు. సినిమా అంటే ఓ మంచి కథను తెరకెక్కించాలి. అందులో పాటలు, ఆకట్టుకునే విజువల్స్ చూపించాలి. పాటలు పాడాలనుకునే, ఫైట్స్ చేయాలనుకునే సగటు మనిషి కలను తెరపై ఆవిష్కరించాలి.
నిజాం కాలం కథతో సినిమా చేస్తానని గతంలో చెప్పారు!
ఆపరేషన్ పోలో నేపథ్యంతో ఓ పీరియాడిక్ సినిమా చేసేందుకు అప్పట్లో కథ సిద్ధం చేసుకున్నా. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించేందుకు సన్నాహాల్లో ఉండగా.. లాక్ డౌన్ వచ్చిపడింది. దాంతో ఆ సినిమా ఆలస్యమైంది. నా తదుపరి సినిమా ఏంటనేది త్వరలో వెల్లడిస్తా. ఓటీటీలోనూ ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది.
ఇప్పుడు ఓటీటీ వల్ల ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలూ చూడగలుగుతున్నారు. ఈ సమయంలో రీమేక్ చిత్రాలు అవసరం అంటారా?
‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే మలయాళ చిత్రం నుంచి రీమేక్ చేశాం. మాతృకను అలాగే తీస్తే రీమేక్ అవసరం లేదు. గతంలో రీమేక్ చిత్రాలు రూపొందించేవాళ్లు ఉన్నది ఉన్నట్లుగా తీసేవారో కాదో తెలియదు కానీ, ఇప్పుడు రీమేక్ చేస్తే తప్పకుండా మనదైన కథనం, మనవైన మాటలు, మనకు నచ్చేలా రూపకల్పన చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఓటీటీ వల్ల ఇతర భాషల చిత్రాలను చూడగలుగుతున్నాం. అలాగే తెరకెక్కిస్తే ఉపయోగం లేదు. ‘భీమ్లా నాయక్’ విషయానికి వస్తే మాతృక నుంచి స్ఫూర్తి మాత్రమే పొందాం. కొత్తగా చూపించగలిగాం.
– రమేష్ గోపిశెట్టి