కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సమ్మతమే’. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సరికొత్త ప్రేమ కథతో ఈ సినిమా రూపొంది ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రానికి వస్తున్న ఆదరణపై దర్శకుడు గోపీనాథ్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ…‘మా సినిమాకు ప్రేక్షకులు తమ సమ్మతాన్ని తెలియజేశారు. మంచి లాభాలు వచ్చాయని చెప్పడం లేదుగానీ పెట్టిన ప్రతి రూపాయీ తిరిగొచ్చింది. మన సమాజం బాగా లేనప్పుడు మారాల్సింది అమ్మాయిలు కాదు సమాజమే అనే విషయాన్ని ఆకట్టుకునేలా చెప్పాం. పగలు ప్రతీకారాలతో కాకుండా ఓ ఆహ్లాదకర సినిమా రూపొందించాలని అనుకున్నాను. ఇవాళ మా చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అదే విషయాన్ని చెబుతున్నారు. మంచి కథ కాబట్టే నిజాయితీగా తెరకెక్కించాం. ఒక మహిళా ప్రధాన చిత్రం సహా మరికొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. కొత్త సినిమా వివరాలు త్వరలో వెల్లడిస్తా’ అన్నారు.