న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే కేంద్రం కరోనా బూస్టర్ డోస్ పంపిణీ సైతం ప్రారంభించింది. ఇటీవల 18 సంవత్సరాలు దాటిన అందరికీ బూస్టర్ డోస్ వేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ప్రస్తుతం రెండు, మూడో డోసుల మధ్య గ్యాప్పై చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తారు.
కొవిడ్కు వ్యతిరేకంగా రెండో డోస్ తీసుకున్న 9 నెలల తర్వాత మాత్రమే బూస్టర్ డోస్ తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. దీని ప్రకారం.. జనవరి 2022లో రెండో డోస్ తీసుకొని వ్యక్తి బూస్టర్ డోస్ కోసం నవంబర్ 2022 వరకు ఆగాల్సిందే. ఈ క్రమంలో సీరమ్ కంపెనీ సీఈవో మాట్లాడుతూ రెండు డోసుల మధ్య వ్యత్యాసాన్ని ఆరు నెలలకు తగ్గించాలన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ మందగించిందని, రెండు.. మూడో డోస్ మధ్య గ్యాప్ ఇందుకు కారణమన్నారు.
ఇదిలా ఉండగా.. ఆరోగ్య కార్యకర్తలతో పాటు వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి కేంద్రం బూస్టర్ డోస్ (ప్రికాషనరీ డోస్) పంపిణీ ప్రారంభించింది. ఇటీవల ఏప్రిల్ 10వ తేదీ నుంచి 18 సంవత్సరాలు పైబడిన అందరు బూస్టర్ డోస్ తీసుకోవచ్చని ప్రకటించింది. అయితే, ప్రైవేటు ఆసుపత్రులు, టీకా కేంద్రాల్లో మూడో డోస్ తీసుకోవచ్చని పేర్కొంది. బూస్టర్ డోస్కు కేంద్రం ఆమోదం తెలుపడంతో అదర్ పూనావాల వ్యాక్సిన్ కొత్త ధరలను ప్రకటించారు. ప్రస్తుతం కోవిషీల్డ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డోసు రూ.600 వసూలు చేస్తుండగా.. ఇకపై రూ.225కు అందుబాటులో ఉంటుందని తెలిపారు.