న్యూఢిల్లీ, అక్టోబర్ 4: కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై ఆ పార్టీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తితో ఉందా? అందుకే తీరు మార్చుకోవాలంటూ సంకేతాలిస్తున్నదా? కొందరు ఆరెస్సెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తున్నది. ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె స్వదేశీ జాగరణ్ మంచ్ సమావేశంలో దేశంలోని పేదరికం, నిరుద్యోగం, అసమానతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారని చెప్పుకొంటున్నారు. అంతకుముందు మతవిద్వేషంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.
‘దేశంలోని 20 కోట్లమందికి పైగా దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. 23 కోట్లమంది రోజుకు కేవలం రూ.375 ఆదాయంతో బతుకు వెళ్లదీస్తున్నారు. నిరుద్యోగం 7.6 శాతానికి ఎగిసింది. పేదరికం, నిరుద్యోగంతోపాటు దేశంలో అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి’ అని దత్తాత్రేయ హొసబలె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకుంటున్నాయి. ఎనిమిదేండ్ల పాలన తర్వాత కూడా ఈ పరిస్థితి ఏమిటని హొసబలె నిలదీసినట్టే కదా? అని విపక్షాలు అంటున్నాయి.
హొసబలే వ్యాఖ్యలు ఆరెస్సెస్లోని భయాందోళనలకు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. బలాన్ని పెంచుకొనేందుకు ఇప్పుడు పేదరికం, నిరుద్యోగం అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. నాగ్పూర్ను ఆందోళన వెంటాడుతున్నదని, అందుకే హొసబలెజీకి నిరుద్యోగులు గుర్తుకు వస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా ట్వీట్ చేశారు.
హొసబలె వ్యాఖ్యలకు ప్రత్యేకత ఏమీ లేదని, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాత్రమే ఆయన ప్రస్తావించారని బీజేపీ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్ సమర్థించుకున్నారు. ప్రధాని మోదీ చాలాసార్లు ఇలాంటి సమస్యలను ప్రస్తావించారని గుర్తు చేస్తున్నారు. హొసబలె మాటలను ఆరెస్సెస్ విమర్శగానో, వైఖరిలో వచ్చిన మార్పుగానో చూడటానికి వీల్లేదని ఆయన చెప్పుకొచ్చారు.
హొసబలె వ్యాఖ్యల అంతరార్థం విస్పష్టమే. కాకపోతే ఆరెస్సెస్ లోని ఒక వర్గం, అలాగే బీజేపీ నేతలు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారా? అనేది తేల్చుకోవడం ఇక్కడ ముఖ్యం అని రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ అన్నారు. హొసబలె వ్యాఖ్యల్లో ఒకరకమైన అసంతృప్తితోపాటుగా రాజకీయ సందేశమూ ఇమిడి ఉన్నదని ఆయన అభిప్రాయం. ముఖ్యంగా పేదరికంపై, అసమానతలపై చేసిన వ్యాఖ్యలను కిద్వాయ్ ఎత్తిచూపుతున్నారు. ‘దేశంలోని 1 శాతం మంది దగ్గర 20 శాతం దేశసంపద ఉన్నదని, 50 శాతం మంది దగ్గర 13 శాతం మాత్రమే ఉన్నదని’ హొసబలె చేసిన వ్యాఖ్య మోదీ కార్పోరేటిజంపై ఎక్కుపెట్టిన అస్త్రమేననేది మరో వాదన. ఈ ఆర్థిక అసమానతల గురించి మనమంతా ఏదైనా చేయాలని ఆయన అన్నారు. అంటే మోదీ పేదలను గాలికి వదిలేసి కార్పొరేట్లకే పప్పు బెల్లాలు పంచిపెడుతున్నారన్న విపక్షాల ఆరోపణలను ఇది బలపరుస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.