(Diabetic eye) గత కొన్ని దశాబ్దాలుగా డయాబెటెస్ వ్యాధి చాప కింది నీరులా మనల్ని చుట్టేస్తున్నది. రక్తంలోని చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఇబ్బంది పెట్టే ఈ సమస్య వల్ల.. శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇన్సులిన్ తక్కువగా విడుదలవడం.. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు అలాగే పెరిగిపోతూ ఉండడం ఈ సమస్యకు ముఖ్య కారణమని వైద్యులు చెప్తున్నారు. ఒకసారి షుగర్ కనిపిస్తే దాన్ని పూర్తిగా తగ్గించే మార్గం లేదు. అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలిని మార్చుకోవడం మాత్రం చేయాల్సి ఉంటుంది.
డయాబెటిస్ సమస్య ఉన్నవారిలో కంటి చూపు మందగించే అవకాశాలు ఉంటాయి. కొన్నికొన్నిసార్లు వివిధ వస్తువుల రూపాలను కనిపెట్టడం కూడా చేయలేకపోతారు. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకని చక్కెర వ్యాధితో బాధపడుతున్న మహిళలు.. వారి కండ్లపై కన్నేసి ఉంచడం చాలా అవసరం. డయాబెటిస్1, టైప్-2 కలిగిఉన్న దాదాపు 25 శాతం మందిలో రక్తంలో అధిక చక్కెరల స్థాయితో పాటు కంటి సమస్యలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ను నియంత్రించలేకపోవడంతో అది కంటి వెనుక ఉండే సన్నటి రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. తద్వారా కంటి చూపు పూర్తిగా పోయే అవకాశాలు ఉంటాయి. అందుకని డయాబెటిస్ ఉన్నవారు కంటిపై ఎక్కువ శ్రద్ధ చూపడం అవసరం.
డయాబెటిస్ ఉన్నవారికి డయాబెటిక్ రెటినోపతి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. డయాబెటిక్ రెటినోపతి కారణంగా డయాబెటిక్ మాక్యులర్ ఎడీమా, కంటిశుక్లం, గ్లాకోమా వంటి కంటి సమస్యలు వస్తాయి. డయాబెటిక్ మాక్యులర్ ఎడీమా, డయాబెటిక్ రెటినోపతి అనేవి డయాబెటిస్ ఉన్నవారిలో అంధత్వానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. కొందరిలో కంటి చూపు సమస్యలు పైకి కనిపించవచ్చు. మరికొందరిలో కనిపించవు. అలా కనిపించనంత మాత్రాని డయాబెటిస్ వ్యాధి కంటిపై ఎలాంటి ప్రభావం చూపదని అనుకోవద్దు.
డయాబెటిక్ ఐ ఉన్నవారిలో సాధారణంగా.. చూపు మసక బారటం, రంగులను గుర్తించడంలో ఇబ్బంది, చూపుపై చుక్కలు, తీగలు వేలాడుతున్న అనుభూతి కలగడం, తక్కువ వెలుతురులో చూడటం ఇబ్బందికరంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు కనిపించగానే వెంటనే కంటి వైద్యుడ్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం అవసరం అని గుర్తించాలి. లేనట్లయితే, కంటి సమస్యలు మరింత ఎక్కువై కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించలేకపోవడం వల్ల అది కండ్లను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ కాలం మధుమేహం ఉన్న వ్యక్తులు, డయాబెటిస్ లక్షణాలు ఉన్న గర్భిణీలు, దీర్ఘకాలంపాటు రక్తంలో గ్లూకోజ్ను అదుపుచేయని వారు, రక్తంలో అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారిలో డయాబెటిక్ ఐ కనిపిస్తుంది. అలాగే, సిగరెట్ స్మోకింగ్ చేసేవారిలో, ఊబకాయులు కూడా డయాబెటిక్ ఐ కి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఇది మన జీవన నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. మధుమేహులు తప్పనిసరిగా రక్తంలో చక్కెరల స్థాయిలను నియంత్రించేలా చూసుకోవడం అవసరం.
క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టుకోవడం ద్వారా మధుమేహం ఉన్నవారు కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మోదీకి ప్రత్యామ్నాయం మమతయే.. రాహుల్ కాదు
ఆ దాడి నిజంగా తప్పిదమే.. క్షమాపణలు చెప్పిన యూఎస్ ఆర్మీ
మళ్లీ ఏకమవుతున్న బీజేపీ-శివసేన!
మర్చిపోలేని ఉరి ఘటనకు ఐదేండ్లు
దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..