హుజూరాబాద్: పోలీసు శాఖలో ఎస్ఐ, సీఐగా పనిచేసి.. హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాలతో మంచి సంబంధాలున్న, సంచలనాల పోలీసు అధికారి దాసరి భూమయ్య ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సింగాపురంలో మంత్రి తన్నీరు హరీశ్రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. రెండేళ్ల క్రితం పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన భూమయ్య తదనంతరం చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న టీంలో సభ్యుడిగా పనిచేశారు. తాజాగా తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భూమయ్య గులాబీ గూటికి చేరుకున్నారు. ఈ సందర్బంగా దాసరి భూమయ్య మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. అయన చెప్పుకునే భావజాలానికి, బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? అని దాసరి భూమయ్య ప్రశ్నించారు. బీజేపీ నిరుద్యోగాన్ని పెంచుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని, అంబానీ అదానీల చేతిలో దేశాన్ని పెడుతోందని ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.