శ్రీరాంపూర్, సెప్టెంబర్ 29: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి చెందిన కంపెనీలో రెండు నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదని కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓసీపీలో మట్టి తవ్వకాలు, రవాణా(ఓబీ) చేసే సుశీ హైటెక్ సంస్థ కార్మికులు వారం రోజులుగా విధులు బహిష్కరించారు. దాదాపు 400 మంది కార్మికులు సంస్థ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. సింగాపూర్ ఓసీపీ ఓబీ మట్టి రవాణాను అడ్డుకొని ఆందోళన చేశారు. మేనేజర్ నాగభూషణాన్ని రెండు నెలల వేతనం రూ.2 కోట్లు, పండుగ బోనస్ ఇవ్వాలని అధ్యక్షుడు పెద్దపల్లి సురేశ్ డిమాండ్ చేశారు.
తొమ్మిది నెలలుగా పీఎఫ్ డబ్బులు కూడా యాజమాన్యం జమ చేయట్లేదని వాపోయారు. సుశీ సంస్థ యాజమాన్యం వేతనాలు ఇవ్వకుండా.. మునుగోడులో వందల కోట్లు ఖర్చు చేసి రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నదని మండిపడ్డారు. వెంటనే కాంట్రాక్టు కార్మికులకు సుశీ సంస్థ యజమాని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వేతనాలు, బోనస్, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించకుంటే శ్రీరాంపూర్ ఓసీపీ నుంచి బొగ్గు ముక్క కూడా బయటికి పోనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.