ముంబై : అలనాటి బాలీవుడ్ దిగ్గజాలు ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా అజ్మీలు మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ఓ లవ్స్టోరీ సినిమాలో వీళ్లంతా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాను కరణ్ జోహార్ డైరక్ట్ చేస్తున్నాడు. అయితే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను కరణ్ వెల్లడించనున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్లు నటిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయిదేళ్ల తర్వాత కరణ్ మళ్లీ డైరక్షన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రేమ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ధర్మేంద్ర జయా బచ్చన్, షబానీలు ప్రత్యేక పాత్రలు పోషించనున్నారు. కరణ్ తీసే సినిమాలో నటిస్తున్నది నిజమే అంటూ ధర్మేంద్ర ఓ మీడియా సంస్థకు క్లారిటీ ఇచ్చేశారు. కరణ్తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సాహాంగా ఉన్నట్లు కూడా ఆయన చెప్పేశారు.
ఒకప్పుడు బాలీవుడ్ హీమ్యాన్గా పేరుగాలించిన ధర్మేంద్ర ఈ సినిమాలో రొమాంటిక్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఆయన్ను చూడనున్నామని కొందరు అంటున్నారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ డైరక్షన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్లో కరణ్ వెల్లడించాడు. ధర్మ ప్రొడక్షన్స్ పేరుతో కరణ్ సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రణ్వీర్సింగ్ బర్త్డే కావడం కూడా విశేషం. సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.