న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా కష్టకాలంలో ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, దేశ అవసరాల కోసం 80శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయన్నారు. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత యూపీఏ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ఆరోపణలు చేశారు. ధరల పెంపునకు గత యూపీఏ ప్రభుత్వం సైతం ప్రధానకారణమన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై కాంగ్రెస్ లక్షల కోట్ల రూపాయల బాండ్లను వదిలేసిందని, వాటిని తిరిగి చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద కాంగ్రెస్ నిరసనలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మేలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఇప్పటి వరకు ఇంధన ధరలు 29 సార్లు పెరిగాయి. మంగళవారం పెట్రోల్పై 29 పైజలు, డీజిల్పై 28 పైసల వరకు చమురు కంపెనీలు పెంచాయి. ప్రస్తుతం అంతర్జాతీయ చమురు బెంచ్ మార్క్ బ్రెంట్ 0.60 శాతం పెరిగి బ్యారెల్కు 75.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలపై కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.