Thiruchitrambalam Telugu Trailer | ‘రఘువరన్ B-Tech’ సినిమాతో టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ధనుష్. ఆ తర్వాత ‘మారి’, ‘అనేకుడు’, ‘తూటా’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ను వరుస ఫ్లాప్లు వెంబటిస్తున్నాయి. ఈయన నటించిన గత రెండు, మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవలే ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన ఆశలన్ని‘తిరుచిత్రంబలం’ సినిమాపైనే ఉన్నాయి. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 18న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ మూవీ తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు.
‘రేయ్ పండు నీ ఆర్డర్ రెడీ అయ్యింది. ఎంతసేపటి నుండి పిలవాలి. వచ్చి తీసుకెళ్ళు’ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. ‘నా లైఫ్ చాలా సింపుల్ లైఫ్. 9 టు 6 వీక్ డేస్ ఫుల్గా వర్క్. వీకెండ్ అంటే ఏదో సినిమా, టీవీ, నెట్ఫ్లిక్స్ చూసుకునే ఒక మాములు లైఫ్’. అంటూ హీరో పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ మొత్తం ఫన్ రైడ్లాగా హాస్యాస్పదంగా అలరిస్తుంది. ప్రకాష్రాజ్, ధనుష్ తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. ‘వచ్చాడు ఘర్షణ వెంకటేష్ ఈయనొక్కడే ఈ లోకాన్ని కాపాడతాడు’ అంటూ ప్రకాష్రాజ్పై వేసే పంచులు అలరిస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఫ్రెండ్షిప్ ట్రాక్ బాగా కుదిరినట్లు ధనుష్, నిత్యామీనన్ సీన్లు చూస్తుంటే తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో ఇప్పుడు ‘ఈయన ఏం చేస్తాడు. బాధతో ఇళయరాజా పాటలు వింటుంటాడు’ అంటూ నిత్యామీనన్ డైలాగ్ ఆకట్టుకుంటుంది.
కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించాడు. ధనుష్కు జోడీగా రాశీఖన్నా, ప్రియా భవాని శంకర్ నటించగా.. కీలకపాత్రలో నిత్యామీనన్ నటించింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.