దేవీ ఉపాసకులు అందరూ కోరుకునేది మణిద్వీప నివాసం. ‘నిష్క పట, నిష్కామ భక్తితో తనను ఆరాధించిన భక్తులు తన అనుగ్రహంతో సర్వవ్యాప్తమైన పరంజ్యోతితో తాదాత్మ్యం చెంది జీవన్ముక్తులవుతారు. లేనిపక్షంలో తన కరుణతో మణిద్వీపానికి చేరి ఆ దివ్య లోకానుభవా న్ని పొంది, బ్రహ్మజ్ఞాన సంపన్నులై మోక్షాన్ని పొందగలరు’ అని చెప్తు న్నది దేవీ భాగవతం. దేవీ ఉపాసకులు చేరే లోకం మణిద్వీపం. ఇది బ్రహ్మాండానికి ఆవల ఉంటుంది. అమ్మవారి సమస్త విభూతులు అంటే స్వరూపాలు, ఐశ్వర్యాలు వ్యాపించిన దివ్య ధామం మణిద్వీపం. జ్ఞానదృష్టితో పరిశీలిస్తే మన శరీరంలో ఉండే 25వ ఆవరణలో వ్యాపించిన చైతన్యమే ఇది. జ్ఞానదృష్టితో చూస్తే ఆత్మ చైతన్యం. ఉపాసనా దృష్టితో చూస్తే మణిద్వీపం. ఇది అమ్మవారి ఆవాసం.
మణిద్వీపం అనేక ప్రాకారాలతో ఉంటుంది. బంగారు ప్రాకారంలో కదంబ వృక్షాలుంటాయి. అమ్మవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులకు ఇక్కడి పుష్పాల నుంచి స్రవించే తేనెను సేవిస్తూ సేదతీరుతుంటారు. పద్మరాగమణులతో అలంకరించిన గృహాల ప్రాకారాలు ఎర్రని కాంతితో వెలిగిపోతూ దర్శనమిస్తాయి. వాటికి ఇంద్రుడు కాప లాగా ఉంటాడు. సమస్త బ్రహ్మాండాలకు చెందిన ఇంద్రులు, రుద్రులు, అగ్నిదేవతలు సమష్టిగా అమ్మవారి ఆజ్ఞ కోసం ఇక్కడ ఎదురు చూస్తుంటారు. ఖడ్గమాల స్తుతులు చేస్తుంటారు. స్వర్ణ ప్రాకారం తర్వాత గోమేధిక ప్రాకారం, దాని తర్వాత వజ్ర ప్రాకారం ఉంటాయి. ఇది వజ్ర వైడూర్యాలతో నిండి ఉంటుం ది. దీన్ని దాటితే ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పదహారు శక్తులు కొలువై ఉంటాయి. ఆపై ముత్యాల ప్రాకారం. ఇక్కడ అమ్మవారి మంత్రిమండలి ఎనిమిది మంది ఉంటారు. ఆ తర్వాత మరకత ప్రాకరం. దీనిలో గాయత్రీదేవితోపాటు ఆరు శక్తులుంటాయి. అది దాటితే పగడాల ప్రాకారం. ఇందులో పంచభూతాల శక్తులుంటాయి. వీరంతా దేవి ఆజ్ఞ కోసం కాచుకొని ఉంటారు.
పగడాల ప్రాకారం తర్వాత చింతామణి గృహం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం పొందిన భక్తాగ్రేసరులు, జ్ఞాన సంపన్నులకు మాత్రమే దీనిలోకి ప్రవేశం లభిస్తుంది. లలితా సహస్రనామాల్లో ‘చింతామని గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థితా’ అని కనిపిస్తుంది. చింతామణి గృహంలో ఒక మంచం, నాలుగు కోళ్లు, దానిపై అమ్మవారు తూర్పువైపు తిరిగి కూర్చుని ఉంటుంది. ఆ మంచానికి ఆగ్నేయంలో చతుర్ముఖ బ్రహ్మ, నైరుతిలో విష్ణుమూర్తి, వాయవ్యంలో రుద్రుడు, ఈశాన్యంలో ఈశ్వరుడు మంచం కోళ్లుగా కూర్చుని దర్శనమిస్తారు. ఈ నాలుగు కోళ్లను కలుపుతూ పైన ఆచ్ఛాదన బల్లగా సదాశివుడు ఉంటాడు. ఆయనపై ఆసీసురాలై దర్శనమిస్తుంది అమ్మవారు.
సృష్టి రజోగుణంతో జరుగుతుంది. ‘సృష్టికర్తను నేనే’ అన్న అహంకారం బ్రహ్మకు రాకుండా అమ్మవారు అదుపులో పెడుతుంది. విష్ణు తత్వం పోషణ. ‘పోషణ కర్తను నేను’ అని విష్ణుమూర్తి అహంకరించకుండా ఆయననూ తన అధీనంలో పెట్టుకుంటుంది అమ్మ. లయకారుడైన రుద్రుడు సైతం ఆమె అధీనంలోనే ఉంటాడు. ఈశ్వర లక్షణం శక్తి, సంపద, చైతన్యం. ఈ మూడు కొత్తసృష్టికి సహకరిస్తాయి. విత్తనం నుంచి చెట్టు, దాని నుంచి ఫలం, అందులో విత్తనం ఉంటుంది. మనకు చెట్టు, ఫలం, విత్తనం కనిపిస్తాయి. కానీ, చెట్టుసారం పండుగా మారడాన్ని చూడలేం. అదే మాయ. ఇది ఈశ్వర సంబంధ శక్తి. దీన్నే తిరోధానం అంటారు. ఈ పనులన్నీ అమ్మవారే చేయిస్తుంది. సదాశివ రూపమే తానై లోకాన్ని అనుగ్రహిస్తుంది అమ్మ.
బ్రహ్మ అంటే శక్తి. ప్రేత అంటే శక్తిలేనివారు. ‘పంచ ప్రేతాసనా సీన పంచకృత్య పరాయణా’ అని అమ్మవారిని స్తుతించాయి లలితా సహస్రనామాలు. అంటే, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాతే శక్తిమంతులయ్యారు. లేదంటే వారంతా శక్తి లేనివారే! అందరి శక్తి రూపం ఆ జగజ్జనని. ఆ కృపామయి మనల్ని అనుగ్రహించు గాక.
వేముగంటి శుక్తిమతి , 99081 10937