శ్రీశైలం : శ్రావణమాసం సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివన్నామస్మరణలతో మార్మోగింది. పురవీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం సందర్భంగా భ్రామరి సమేత మల్లికార్జునుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి అమ్మవార్ల నిత్య ఆర్జిత సేవలు యథాతధంగా కొనసాగిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టగా.. శీఘ్ర, అతిశీఘ్ర, విరామ దర్శనాలకు గంట సమయం పట్టిందని పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.
మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి వేదపండితులు మహాసంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన, పల్లకీసేవను కనులపండువలా నిర్వహించారు.
క్షేత్రంలో శ్రావణమాసం నాలుగో రోజైన సోమవారం నాగుల చవితి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న తెలిపారు. తెల్లవారుజామునే చలివిడిముద్ద, నువ్వుల ఉండలు, యఙ్ఞోపవీతం పలు రకాల పూలు పండ్లతో ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్టలో కొలువైన జంటనాగుల విగ్రహాలకు పూజలు చేశారు. ఆవుపాలతో అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితికి స్వామి వారికి పూజలు చేయడంతో నాగ దోషాలు తొలిగిపోతాయని స్థానాచార్యులు పూర్ణానంద తెలిపారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం సర్పదోశ నివారణ పూజలు ఆర్జిత సేవగా ప్రారంభించారు. ప్రతీ రోజు మూడు విడతలుగా పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అవకాశాన్ని భక్తులు సద్వినియోగ చేసుకోవాలని ఈవో కోరారు.
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న గణేష సదనంలోని (గది నెం 246) కుటీర నిర్మాణ పథకానికి కర్నూల్కు చెందిన బీ విజయలక్ష్మి రూ.4లక్షలు, బీ రామిరెడ్డి జ్ఞాపకార్థం నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళంగా అందజేశారు. సోమవారం ఆలయ ఈఈ రామకృష్ణకు నగదురూపంలో అందించగా దాతలకు స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి, ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు.