సిద్దిపేట : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం 9వ ఆదివారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. 50వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. స్వామి వారి సోదరి ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి కొండపైకి తీసుకుపోయి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.