ముంబై: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడంపై నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. డిప్యూటీ సీఎం పదవిపై ఫడ్నవీస్ సంతోషంగా లేరని, ఆయన ముఖంలోనే ఇది కనిపిస్తున్నదని మీడియాతో అన్నారు. ‘బీజేపీలో- ఢిల్లీ లేదా నాగ్పూర్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత – ఎలాంటి రాజీ లేకుండా అనుసరించాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. షిండేతో కలిసి అస్సాంలోని గౌహతికి వెళ్లిన వారంతా కూడా ఆయనతో సహా డిప్యూటీ సీఎం పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారని శరద్ పవార్ తెలిపారు. అయితే బీజేపీ ఏకంగా సీఎం పదవిని ఆఫర్ చేస్తుందని షిండే అయినా ఊహించి ఉండరని అన్నారు.
షిండేను సీఎంగా ప్రకటించిన ఫడ్నవీస్, ప్రభుత్వంలో తాను భాగం కావడం లేదని చెప్పిన విషయాన్ని శరద్ పవార్ గుర్తు చేశారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడితో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. శివసేనలో తిరుగుబాటుకు ప్రధాన కారణమైన ఫడ్నవీస్, మళ్లీ సీఎం కావాలని ఆశించి భంగపడి చివరకు అసంతృప్తితో డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. సీఎం కాకుండా డిప్యూటీ సీఎం పదవి చేపట్టడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదని అందుకే తొలుత ప్రభుత్వంలో తాను భాగం కావడం లేదని చెప్పారన్నారు. అయితే బీజేపీ అధిష్ఠానం ఒత్తిడికి తలొగ్గిన ఫడ్నవీస్ చివరి క్షణంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు.
కాగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ ముగిసిపోలేదని శరద్ పవర్ తెలిపారు. శివసేనలో గతంలో కూడా ఇలాంటి తిరుగుబాట్లు ఎన్నో జరిగాయని గుర్తు చేశారు. ఛగన్ భుజబల్, నారాయణ్ రాణే వంటి నేతలు కూడా శివసేనలో తిరుగుబాటు చేసి అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు.
మరోవైపు దీనికి ముందు సీఎం షిండేకు శరద్ పవార్ అభినందనలు తెలిపారు. ‘మహారాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.