బీర్కూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని అభివృద్ధి పరుస్తున్నానని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న కాటేజీలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..ఆలయ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన గాలి గోపురాలు, యాగశాల, కాటేజీలు చాలా అందంగా కనబడుతున్నాయన్నారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ద్రోణవల్లి సతీశ్, మద్దినేని నాగేశ్వర్రావు, నర్సరాజు, రాంబాబు, మురళి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.