బడంగ్పేట, అక్టోబర్ 2: టీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని విద్యా శాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగల పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన 500 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
భాగ్యనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, మాజీ కౌన్సిలర్ యెల్చల సుదర్శన్రెడ్డి, మాజీ సర్పంచ్ మమత సుదర్శన్రెడ్డితో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో గులాబీ కండువా కప్పుకొన్నారు. నాదర్గుల్ అంబేద్కర్నగర్కు చెందిన ఎం సుధాకర్ ఆధ్వర్యంలో మరికొందరు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.