హైదరాబాద్: దేశ్ కీ నేత కేసీఆర్ అన్న బ్యానర్లు ఇప్పుడు హైదరాబాదీలను అట్రాక్ట్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు నగరంలో వివిధ ప్రాంతాల్లో భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో ఇవాళ జరగనున్న ఆ పార్టీ సర్వసభ్య సమావేశం నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన పోస్టర్లు అందర్నీ స్టన్ చేస్తున్నాయి.
దేశం దశదిశను మార్చేందుకు సీఎం కేసీఆర్ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లనున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో పోరాటం మొదలు పెట్టనున్నారు. విజయ దశమి వేళ నూతన పార్టీని ప్రకటించనున్నట్లు కేసీఆర్కు విషెస్ చెబుతూ టీఆర్ఎస్ నేతలు సిటీలో బ్యానర్లను ఏర్పాటు చేశారు.
ఇవాళ మధ్యాహ్నం 1.19 నిమిషాలకు సీఎం కేసీఆర్ అత్యంత కీలకమైన ప్రకటన చేయనున్నారు. దేశ ప్రగతికి సంబంధించిన ఆ ప్రకటనపై సర్వతా ఆసక్తి నెలకొన్నది. దేశాన్ని అభ్యున్నతి పథంలో నడిపేందుకు కేసీఆర్ నడుం బిగించారు. ఈ నేపథ్యంలో ఆయన చేయబోయే ప్రకటనపై వివిధ రాష్ట్రాల నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో ప్రజాప్రయోజన పథకాలను ఇక నుంచి దేశవ్యాప్తంగా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ దూసుకువెళ్తున్నారు. రైతు బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు లాంటి పథకాలను దేశ ప్రజలకు కూడా చేరేలా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
11 గంటలకు తెలంగాణ భవన్లో ఇవాళ ఆ పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ నేతలు హాజరవుతున్నారు. ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పూరించబోయే సమరశంఖం గురించి సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారు. విద్వేష రాజకీయాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కొత్త పార్టీకి రూపకల్పన చేశారు.