ఖమ్మం : తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, తన భూమికి హద్దులు సర్వే చేసి చూపితే తగిన రక్షణ చర్యలు తీసుకుంటామని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఇదే అదునుగా భావించిన రెవెన్యూ సిబ్బంది రైతుతో బేరసారాలకు దిగారు. రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకొన్నారు. అందులో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన జిల్లాలోని వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకున్నది.
ఏసీబీ డీఎస్పీ మధుసూదన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని తోట సాంబశివరావు, తోట తారక, తోట వసంత మహేశ్కు చెందిన సుమారు 25 ఎకరాల భూమి విషయంలో సరిహద్దు యజమానులైన మునీర్ మూష, ఈసాలకు కొంతకాలంగా వివాదం జరుగుతోంది.
ఈ క్రమంలో తోట సాంబశివరావు వేంసూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఇది తమ పరిధి కాదని, తహసీల్దార్ కార్యాలయంలో చూసుకోవాలని వారు తెలిపారు. దీంతో భూమి విషయాన్ని కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్ ఉపేందదర్, సర్వేయర్ గురవేశ్లకు వివరించగా సరిహద్దు సర్వే చేయాలంటే రూ.2లక్షలు ఇవ్వాల్సిందేనని, లేకుంటే కట్టమని తెలిపారు. చివరకు రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.లక్ష ముందుగా అందజేయాలని రైతుకు డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్ తెలిపారు.
దీంతో సదరు రైతు ఖమ్మం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు..బుధవారం రైతు తన భూమి సర్వే విషయమై సర్వేయర్తో మాట్లాడటంతో డబ్బులను సర్వేయర్ కారు డాష్బోర్డులో పెట్టాలని కోరాడు. రైతు సర్వేయర్ కారు డాష్బోర్డులో డబ్బు పెడుతుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్లు పట్టుబడ్డారు. వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాడిచేసిన వారిలో ఖమ్మం ఇన్స్పెక్టర్ రమణమూర్తి, వరంగల్ ఇన్స్పెక్టర్ సతీశ్క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు.