హైదరాబాద్ : ఇటీవల డెప్యూటీ కలెక్టర్గా నియామకమైన కల్నల్ సంతోష్బాబు సతీమణి బీ సంతోషి మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం, వ్యవసాయ విశ్వవిద్యాలయాల కార్యకలాపాలపై అవగాహన పెంచుకునేందుకు ఆమె వర్సిటీని సందర్శించారు. వర్సిటీకి చేరుకున్న సంతోషికి వైస్ చాన్సలర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పరిపాలనా భవనంలోని కమిటీ హాలులో ఉప కులపతి డాక్టర్ వీ ప్రవీణ్రావుతో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కార్యకలాపాలను ప్రవీణ్రావు ఆమెకు వివరించారు. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి, కంది, వేరుశనగ వంటి ప్రధాన పంటలు సాగు చేస్తున్నామని, వరి పంటలో అధిక ఉత్పత్తి సాధించగా.. ప్రస్తుతం విలువ జోడింపుపై దృష్టి పెట్టినట్లు ఆమెకు వివరించారు. అలాగే పత్తిలో అధిక సాంద్రత కలిగిన నూతన రకాల (వంగడాలు) రూపకల్పనకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఏర్పాటైన అనతికాలంలోనే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోనే టాప్ 10 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచిందని వివరించారు.
ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిశ్వవిద్యాలయం, వ్యవసాయంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అమలు కోసం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీస్, రోబోటిక్స్పై అగ్రిహబ్ ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆమె రాజేంద్రనగర్లోని పలు ప్రయోగశాలలను, పరిశోధనా కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్ కుమార్తో పాటు విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.