హైదరాబాద్ : పాఠశాలల పునః ప్రారంభం తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు తెరిచి, భౌతిక తరగతులు నిర్వహించాలని మంగళవారం ఆదేశాలిచ్చింది. కొవిడ్ నేపథ్యంలో నిబంధనలకు లోబడి తరగతులు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సైతం అంగన్వాడీలతో సహా.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ ఒకటో తేదీనుంచి తెరవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్ట్ 30లోగా శానిటైజేషన్ చేయాలని పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులకు ఆదేశాలిచ్చారు. మరో వైపు రాష్ట్రంలో విద్యా సంస్థల పునః ప్రారంభం సన్నధతపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జడ్పీ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులు పాల్గొన్నారు.