ఒడెన్స్: సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. డెన్మార్క్ ఓపెన్లో వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-16, 12-21, 21-15తో బుసానన్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది. గంటా ఏడు నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో నాలుగో సీడ్ సింధు.. తుదికంటా పోరాడి నెగ్గింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో కిడాంబి శ్రీకాంత్ 21-23, 9-21తో ప్రపంచ నంబర్వన్ కెంటా మొమోటా (జపాన్) చేతిలో ఓడాడు.
తొలి గేమ్లో కెంటాకు గట్టి పోటీనిచ్చిన శ్రీకాంత్.. రెండో గేమ్లో అదే జోరు కనబర్చలేకపోయాడు. మరో మ్యాచ్లో యువ ఆటగాడు లక్ష్యసేన్ 15-21, 7-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 21-14, 15-21, 15-21తో గో జీ ఫయ్ -నూర్ ఇజుద్దీన్ (మలేషియా) ద్వయం చేతిలో ఓడింది.
చెమటోడ్చిన సింధు..
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన పీవీ సింధు.. చాన్నాళ్ల విరామం తర్వాత కోర్టులో తీవ్రంగా శ్రమించింది. తొలి గేమ్ను సునాయాసంగా నెగ్గిన సింధు.. రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. సింధు సుదీర్ఘ ర్యాలీలతో దెబ్బ కొట్టాలని చూస్తే.. బుసానన్ పదునైన స్మాష్లతో తెలుగమ్మాయిని విసిగించింది. దీంతో రెండో గేమ్లో వెనుకబడిపోయిన సింధు.. నిర్ణయాత్మక మూడో గేమ్లో విజృంభించింది. వరుసగా ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకొని ఆధిపత్యం కనబర్చిన సింధు.. అదే జోరులో మ్యాచ్ను ముగించింది. నేడు జరుగనున్న క్వార్టర్స్ పోరులో ఐదో సీడ్ సియాంగ్తో సింధు తలపడనుంది. గురువారం బరిలోకి దిగిన భారత షట్లర్లలో సింధు మినహా తక్కినవాళ్లంతా ఓటమి వైపు నిలిచారు. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి-ధ్రువ్ కపిల జంట పోరాడి ఓడగా.. పురుషుల డబుల్స్లో అర్జున్-ధ్రువ్ జోడీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.