కాకినాడ: జిల్లాలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో పెద్ద సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు మృతి చెందారు. మున్సిపల్, ప్రజారోగ్య విభాగం అధికారులు కాలుష్య నివారణ, పరిశుభ్రతపై దృష్టిపెట్టకపోవడం వల్ల డెంగ్యూ, మలేరియా కేసులు పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు అధికారికంగా జిల్లాలో 309 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. గత నెల రోజుల్లోనే 250 కిపైగా కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
కాకినాడ జిల్లాతోపాటు కాకినాడ నగరంలో డెంగ్యూ ప్రబలడంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. మారుమూల గ్రామాల్లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో మందులు దొరక్కపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. వైద్యులు సక్రమంగా విధులు కావడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీలు, సీహెచ్సీలకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. చేసేదిలేక ప్రైవేట్ హాస్పిటళ్లను ప్రజలు ఆశ్రయించడంతో అవి కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ దవాఖానాల్లో అన్ని పడకలు డెంగ్యూ రోగులతో నిండిపోయినట్లు తెలుస్తున్నది. ప్రైవేట్ దవాఖానలు అదనపు ఛార్జీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ప్రజలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు కూడా వెనకాడటం లేదు.
డెంగ్యూ జ్వరాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పట్టించుకోవడం లేదని, పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ నగరంలోని కొన్ని డివిజన్లలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 26 కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. కేసుల సంఖ్య పెరగడంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించిన హైరిస్క్ ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. స్మార్ట్ సిటీలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు 9వ డివిజన్లో ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేఎంసీ కమిషనర్ కే రమేష్ పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందకుండా కేఎంసీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.